ఆకలేస్తే ఇసుక తింటున్నాం.. ప్లీజ్ అన్నం పెట్టండి : గాజా దుస్థితిపై బాలుడు కన్నీటి వీడియో

ఆకలేస్తే ఇసుక తింటున్నాం.. ప్లీజ్ అన్నం పెట్టండి : గాజా దుస్థితిపై బాలుడు కన్నీటి వీడియో

కొన్ని వారాల కిందట ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులు పాలస్తీనా ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయటమే కాకుండా తినటానికి తిండి కూడా లేకుండా చేసింది. వందల మంది ఈ దాడుల్లో చనిపోవటం, తీవ్రంగా గాయపడటం తెలిసిందే. కనీస అవసరాలైన ఆహారం, వైద్యం కూడా అక్కడి ప్రజలకు అందటం లేదు. ఇరాన్ పెంచి పోషించిన హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ చేసిన దాడులు చాలా మంది సామాన్య పాలస్తీనియన్లను నిరాశ్రయులుగా మార్చేసింది. 

ప్రస్తుతం గాజాలోని పరిస్థితులు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికాక తప్పదు. ఆటబొమ్మలతో, బడి పాఠాలతో కాలం గడపాల్సిన చిన్నారులు కనీసం ఒక్క పూట ఆకలి తీరేందుకు ఏదైనా సాయం అందితే చాలు అని సరిపెట్టుకునే రోజులు అక్కడ కొనసాగుతున్నాయి. మరో పక్క అక్కడి ప్రజలకు అందాల్సిన సాయం ట్రక్కులను ఉగ్రవాదులు అడ్డుకుని వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో వందల మంది ఒక్క రొట్టెముక్క దొరికితే ఈ పూటకు చాలు దేవుడా అని వేడుకుంటున్నారు.

 

గాజా ప్రాంతంలో కొనసాగుతున్న వాస్తవ పరిస్థితులపై ఒక బాలుడు మాట్లాడుతూ తమ దీన దుస్థితిని చెబుతున్న వీడియో ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రతి రోజూ తమకు ఆహారం వస్తుందని చెబుతున్నారే కానీ ఒక్క ట్రక్కు కూడా రావటం లేదని బాలుడు వాపోయాడు. తినటానికి తిండి లేక మట్టి తిని ఆకలి చంపుకుంటున్నామని బాలుడు వీడిలో వెల్లడించాడు. తమపై దయచూపించాలని, తమకు కొంచెం తినటానికైనా సహాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్నాడు. బ్రెండ్ తినాల్సిన తాము మట్టి తింటున్నామంటూ చెప్పిన మాటలు కలిచివేస్తున్నాయి. ఒక్క బ్రెడ్ ముక్క రూ.450కి అమ్ముతున్నారని చెప్పాడు. 

పరిస్థితులు ఇంత దారుణంగా దిగజారిపోయినట్లు తమకు తినటానికి ఏమీ దొరక్క మట్టితో కడుపు నింపుకుంటున్నట్లు ఆ పిల్లవాడు చెప్పిన మాటలు అందరి మనసులను కరిగిస్తున్నాయి. ఇంత దారుణంగా జీవిస్తున్నవారు మనముందే భూమి మీద వేరే ప్రాంతాల్లో ఉన్నారా అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లకమానవు.