
బీజింగ్ : భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 11 ప్రాంతాలకు చైనా... చైనీస్, టిబెటన్, పిన్యిన్ భాషల్లో పేర్లను విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాలశాఖ మంత్రి ఏప్రిల్ 2వ తేదీన పేర్లను విడుదల చేశారు. చైనా కేబినెట్ నిర్ణయం మేరకు ‘జాంగ్నన్’ పేరుతో ఈ జాబితాను ఆ దేశం విడుదల చేసింది. పేర్లు విడుదల చేసిన వాటిలో 2 భూభాగాలు, 2 నివాస ప్రాంతాలు, 5 పర్వతాలు, 2 నదులు ఉన్నాయని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
2017లో తొలిసారిగా అరుణాచల్లోని 6 ప్రాంతాలకు ఇలా చైనీస్ పేర్లను విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు రెండోసారి పేర్లను విడుదల చేసింది. గతంలోనే భారత్ చైనా తీరును తీవ్రంగా ఖండించింది. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది.