సెప్టెంబర్​లో కరోనా పనిపట్టే వ్యాక్సిన్.?

సెప్టెంబర్​లో కరోనా పనిపట్టే వ్యాక్సిన్.?
  • ‘ఎమర్జెన్సీ’ కోసమేనన్న చైనా
  • ముందు డాక్టర్లకు.. ఆ తర్వాత జనాలకు
  • 1,100 మందిపై ఆక్స్​ఫర్డ్​ వర్సిటీ ట్రయల్స్​
  • మన దగ్గర 70 కంపెనీల ప్రయత్నాలు..

వెలుగు సెంట్రల్​డెస్క్​  కరోనా వైరస్​కు పుట్టినిల్లు చైనా. అక్కడా వ్యాక్సిన్​ తయారైపోయింది. ప్రస్తుతం రెండు, మూడో ట్రయల్స్​ జరుగుతున్నాయి. సెప్టెంబర్​ నాటికల్లా వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా చైనా సెంటర్​ ఫర్​ డిసీజ్​ ప్రివెన్షన్​ అండ్​ కంట్రోల్​ (సీడీసీ) చీఫ్​ డాక్టర్​ గావ్​ ఫు చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ పరిస్థితుల్లో మాత్రమే వ్యాక్సిన్​ను ఇస్తామని చెప్పారు. నిజానికి వ్యాక్సిన్​కానీ, మందుగానీ తయారు చేయాలంటే టైం పడుతుందని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా వ్యాక్సిన్​ను తయారు చేస్తున్నామని, ట్రయల్స్​ జరుగుతున్నాయని ఆయన అన్నారు. మళ్లీ కరోనా తిరగబెడితే ఈ వ్యాక్సిన్​ను ఎమర్జెన్సీ మందుగా వాడతామన్నారు. అది కూడా అందరికీ ఇవ్వబోమన్నారు. కేవలం డాక్టర్లు, మెడికల్​ వర్కర్లకు ముందుగా వాడతామన్నారు. అందరికీ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుతుందన్నారు.

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ వ్యాక్సిన్​ విషయంలో ఓ అడుగు ముందుకే వేసింది. ట్రయల్స్​ పూర్తి కాకుండానే 10 లక్షల డోసుల తయారీకి ఏర్పాట్లు చేసేసుకుంది. ఇండియా సహా వివిధ దేశాలకు చెందిన 7 కంపెనీలు ఆ పనిలోనే ఉన్నాయిప్పుడు. బ్రిటన్​లో మూడు, యూరప్​లో రెండు, చైనా, ఇండియాలో ఒక్కో కంపెనీ వ్యాక్సిన్​ను తయారు చేయనున్నాయి. వ్యాక్సిన్​పై నమ్మకంగా ఉండడం, గతంలో మెర్స్​ వ్యాక్సిన్​ తయారు చేసిన అనుభవం ఉండడంతో ముందుగానే చేడాక్స్​1ఎన్​కొవ్​19 వ్యాక్సిన్​ తయారీకి ప్లాన్​ చేస్తున్నారు. యూనివర్సిటీ టెస్ట్​ చేస్తున్న ఆ వ్యాక్సిన్​ పేరు చేడాక్స్​1 ఎన్​కొవ్​19 (ChAdOx1 nCoV-19). దాన్ని చేడాక్స్​1 అనే వైరస్​తో తయారు చేశారు. జలుబుకు కారణమయ్యే అడినోవైరస్​కు ఇనాక్టివ్​ రూపమే ఈ చేడాక్స్​1. మనుషులకు ఇచ్చేలా ఆ వైరస్​ జీన్స్​లో మార్పులు చేసి ఇనాక్టివ్​గా మార్చారు. ఈ చేడాక్స్​కు కరోనా వైరస్​లోని కొమ్ముల్లో ఉండే స్పైక్​ గ్లైసోప్రొటీన్లను కలిపి చేడాక్స్​1ఎన్​కొవ్​19కు రూపునిచ్చారు. కరోనా వైరస్​ ఏసీఈ2 రిసెప్టర్లకు అతుక్కుని ఇన్​ఫెక్షన్​ సోకుండా ఉండేలా ఈ వ్యాక్సిన్​ కాపాడుతుంది.

సీరం ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాకు ఫండ్స్​

టీబీ మందుతో వ్యాక్సిన్​ తయారు చేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా పని చేస్తోంది. జర్మనీలోని మాక్స్​ప్లాంక్​ ఇనిస్టిట్యూట్​ ఫర్​ ఇన్ఫెక్షియస్​ బయాలజీ సహకారం అందిస్తోంది. ఈ వ్యాక్సిన్​ తయారీకి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్​ అసిస్టెన్స్​ కౌన్సిల్​ ఆర్థిక సాయం చేస్తోంది. అనుమతులు, ముడి సరుకు విషయంలోనూ సాయం చేయనుంది. వ్యాక్సిన్​పై ఎలాంటి పేటెంట్​ తీసుకోబోమని, ప్రజలను కాపాడడమే తమకు ముఖ్యమని ఇటీవల కంపెనీ సీఈవో ప్రకటించారు. వ్యాక్సిన్​ తయారీని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇమ్యునాలజీ సమన్వయం చేస్తుంది. వ్యాక్సిన్​ తయారు చేసే అన్ని కంపెనీలకూ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయోటెక్నాలజీ నోడల్​ ఎజెన్సీగా ఉంటుంది. హైదరాబాద్​కు చెందిన ఆంకో సీక్​ బయో ప్రైవేట్​ లిమిటెడ్​ అనే కంపెనీ ఊపిరితిత్తుల ఆధారంగా మందుల తయారీపై దృష్టి పెట్టింది. కరోనా ఎఫెక్ట్​ లంగ్స్​పైనే ఉండడంతో అదే మోడల్​ను ఎంచుకుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల యాంటీబాడీలను బేస్​ చేసుకుని వ్యాక్సిన్​ తయారు చేసేందుకు సిద్ధమవుతోంది విర్కోవ్​ బయోటెక్​ కంపెనీ.

1,100 మందిపై ట్రయల్స్​

ప్రస్తుతం ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​పై థేమ్స్​ వ్యాలీ రీజియన్​లో ట్రయల్స్​ జరుగుతున్నాయి. 18 నుంచి 55 ఏళ్ల వయసున్న1,102 మందిపై ప్రయోగాలు చేయనున్నారు. అది కూడా వైరస్​ సోకని ఆరోగ్యవంతమైన వాళ్లనే అందుకు ఎంచుకున్నారు. అందులో ఇప్పటికే తొలి డోస్​ను ఓ మహిళకు ఇచ్చారు. వలంటీర్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. సగం మందికి చేడాక్స్​1ను, మరో సగం మందికి మెనింజైటిస్​ (మెదడు ఇన్​ఫెక్షన్​)ను అడ్డుకునే మెనింజైటిస్​ వ్యాక్సిన్​ ‘మెన్​ఏసీడబ్ల్యూవై’ని ఇస్తారు. అయితే, ఎవరికి ఏ వ్యాక్సిన్​ ఇచ్చారో మాత్రం చెప్పారు. అసలు ట్రయల్​ స్టార్ట్​ కావడానికి ముందు పది మంది వలంటీర్లకు నాలుగువారాలకుగానూ రెండు డోసుల చేడాక్స్​1ను ఇచ్చి టెస్ట్​ చేస్తున్నారు. ఈ ట్రయల్స్​ అన్నీ జెన్నర్​ ఇనిస్టిట్యూట్​లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న సారా గిల్బర్ట్​ నేతృత్వంలో జరుగుతున్నాయి. 80 శాతం ఈ వ్యాక్సిన్​ సక్సెస్​ అవుతుందని ఆమె చెబుతున్నారు. ట్రయల్స్​ తొలి దశలో భాగంగా వచ్చే నెలలో 800 మందిపై ప్రయోగం మొదలుపెట్టనున్నారు. వాళ్లలో యాంటీ బాడీల తయారీ, రిసెప్టర్​ ప్రొటీన్లలో మార్పుల వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ ట్రయల్స్​ సక్సెస్​ అయితే ఆఫ్రికా దేశాల్లోనూ ట్రయల్స్​ చేసేందుకు యూనివర్సిటీ టీం రెడీ అవుతోంది. ముందుగా కెన్యాలో ఆ ప్రయోగాలు చేయనున్నారు. కెన్యా మెడికల్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​, ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరిపి టెస్టులు చేస్తారు.  ఆక్స్​ఫర్డ్​, ఇంపీరియల్​ కాలేజీల వ్యాక్సిన్​ డెవలప్​మెంట్​కు బ్రిటన్​ సుమారు రూ.377 కోట్లు (4 కోట్ల పౌండ్లు) కేటాయించింది.

ఎయిమ్స్​లో సెప్సిస్​ మందుపైనా..

ఎయిమ్స్​ ఢిల్లీ, ఎయిమ్స్​ భోపాల్​, చండీగఢ్​లోని పీజీఐఎంఈఆర్​లు సెప్సిస్​ను తగ్గించే ‘సెప్సివాక్​’ డ్రగ్​పైనా పరిశోధనలు చేయబోతున్నాయి. ఏదైనా ఇన్​ఫెక్షన్​ వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనేందుకు రక్తంలోకి మన బాడీ కొన్ని కెమికల్స్​ను విడుదల చేస్తుంది. దాంట్లో బ్యాలెన్స్​ లేకపోతే సెప్సిస్​ కిందకు దారితీస్తుంది. ఒంట్లోని అవయవాలపై ఎఫెక్ట్​ పడుతుంది. దానిని అడ్డుకునే సెప్సివాక్​నే కరోనా ట్రీట్​మెంట్​కు వాడబోతున్నాయి ఆయా సంస్థలు. మూడు ఆస్పత్రుల్లోని 50 మందికి ఆ మందును 0.3 మిల్లీ లీటర్లకు వరకు ఇస్తారు. ఆరు నెలల పాటు పరీక్షిస్తారు. ఈ మందుతో శరీరానికి ఉండే సహజమైన రక్షణ గుణాన్ని సెప్సివాక్​ పెంచుతుందని భావిస్తున్నారు. దీంతో కరోనా పేషెంట్ల మరణాల రేటును తగ్గిస్తుందని, త్వరగా కోలుకునేలా చేస్తుందని అంటున్నారు. అంతేగాకుండా కరోనా పాజిటివ్​ వ్యక్తుల కాంటాక్ట్​లనూ కాపాడుతుందని చెబుతున్నారు.

సీఎస్​ఐఆర్​ ఆధ్వర్యంలో ట్రయల్స్​

కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ రీసెర్చ్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్​), అహ్మదాబాద్​కు చెందిన జైడస్​ క్యాడిలాలు కలిసి 2007లో పబ్లిక్​ప్రైవేట్​ పార్ట్​నర్​ షిప్​ కింద సెప్సివాక్​ను తయారు చేశాయి. సెప్సిస్​ మరణాల రేటును 50% వరకు తగ్గించిన ఈ సెప్సివాక్​ను కరోనా పేషెంట్లపై వాడేందుకు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ హెల్త్​ సర్వీసెస్​, సెంట్రల్​ డ్రగ్స్​ స్టాండర్డ్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్​లు అనుమతిచ్చాయి. సీఎస్​ఐఆర్​ ఆధ్వర్యంలోనే 3 ఆస్పత్రులు ట్రయల్స్​ చేయనున్నాయి. 6 నెలల పాటు ట్రయల్స్​ సాగుతాయి. ఈ రిజల్ట్​ను బట్టే దానిని కరోనా పేషెంట్లకు వాడేది లేనిది తేలుస్తామని సైంటిస్టులు అంటున్నారు. ‘‘కరోనా పేషెంట్లలో అవయవాలు ఫెయిల్​ కాకుండా ఈ మందు కాపాడుతుంది. చనిపోయే ముప్పును త్గగిస్తుంది’’ అని డ్రగ్స్​ కంట్రోల్​ జనరల్​ ఆఫ్​ ఇండియా డాక్టర్​ వీజీ సోమానీ చెప్పారు.

మనమెక్కడున్నం?

వ్యాక్సిన్​ తయారీకి మన దేశ కంపెనీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో 16 ప్రాజెక్టులకు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్​ అసిస్టెన్స్​ కౌన్సిల్, బయోటెక్నాలజీ డిపార్ట్​మెంట్​ ఆమోదం తెలిపాయి. 70 కంపెనీలు వ్యాక్సిన్ల తయారీపై పనిచేస్తున్నా.. 6 కంపెనీలవి ముందున్నాయి. వీటిలో 3 సంస్థలు హైదరాబాద్​వే కావడం విశేషం. జైడస్​ క్యాడిలా 2 వ్యాక్సిన్లపై పనిచేస్తోంది. ఆల్ఫా2బీ ఇంటర్​ఫెరాన్​తో వ్యాక్సిన్​ తయారు చేసే పనిలో ఉంది. రీకాంబినెంట్​ డీఎన్​ఏ టెక్నాలజీ, రివర్స్​ జెనెటిక్​ టెక్నాలజీలతో వ్యాక్సిన్లను డెవలప్​ చేస్తోంది.  రేబిస్​ వైరస్​, ఫ్లూలను వెక్టార్లుగా వాడుకుంటూ కరోనాను చంపే వ్యాక్సిన్లపై అమెరికాకు చెందిన ఫ్లూజెన్​ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్​ విస్కాన్సిన్​ మాడిసన్​తో కలిసి ప్రయోగాలు చేస్తోంది భారత్​ బయోటెక్. ఈ రెండు కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో లీడింగ్​లో ఉన్నాయి.