- ‘ఎమర్జెన్సీ’ కోసమేనన్న చైనా
- ముందు డాక్టర్లకు.. ఆ తర్వాత జనాలకు
- 1,100 మందిపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ ట్రయల్స్
- మన దగ్గర 70 కంపెనీల ప్రయత్నాలు..
వెలుగు సెంట్రల్డెస్క్ కరోనా వైరస్కు పుట్టినిల్లు చైనా. అక్కడా వ్యాక్సిన్ తయారైపోయింది. ప్రస్తుతం రెండు, మూడో ట్రయల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా చైనా సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సీడీసీ) చీఫ్ డాక్టర్ గావ్ ఫు చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ పరిస్థితుల్లో మాత్రమే వ్యాక్సిన్ను ఇస్తామని చెప్పారు. నిజానికి వ్యాక్సిన్కానీ, మందుగానీ తయారు చేయాలంటే టైం పడుతుందని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా వ్యాక్సిన్ను తయారు చేస్తున్నామని, ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన అన్నారు. మళ్లీ కరోనా తిరగబెడితే ఈ వ్యాక్సిన్ను ఎమర్జెన్సీ మందుగా వాడతామన్నారు. అది కూడా అందరికీ ఇవ్వబోమన్నారు. కేవలం డాక్టర్లు, మెడికల్ వర్కర్లకు ముందుగా వాడతామన్నారు. అందరికీ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుతుందన్నారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ విషయంలో ఓ అడుగు ముందుకే వేసింది. ట్రయల్స్ పూర్తి కాకుండానే 10 లక్షల డోసుల తయారీకి ఏర్పాట్లు చేసేసుకుంది. ఇండియా సహా వివిధ దేశాలకు చెందిన 7 కంపెనీలు ఆ పనిలోనే ఉన్నాయిప్పుడు. బ్రిటన్లో మూడు, యూరప్లో రెండు, చైనా, ఇండియాలో ఒక్కో కంపెనీ వ్యాక్సిన్ను తయారు చేయనున్నాయి. వ్యాక్సిన్పై నమ్మకంగా ఉండడం, గతంలో మెర్స్ వ్యాక్సిన్ తయారు చేసిన అనుభవం ఉండడంతో ముందుగానే చేడాక్స్1ఎన్కొవ్19 వ్యాక్సిన్ తయారీకి ప్లాన్ చేస్తున్నారు. యూనివర్సిటీ టెస్ట్ చేస్తున్న ఆ వ్యాక్సిన్ పేరు చేడాక్స్1 ఎన్కొవ్19 (ChAdOx1 nCoV-19). దాన్ని చేడాక్స్1 అనే వైరస్తో తయారు చేశారు. జలుబుకు కారణమయ్యే అడినోవైరస్కు ఇనాక్టివ్ రూపమే ఈ చేడాక్స్1. మనుషులకు ఇచ్చేలా ఆ వైరస్ జీన్స్లో మార్పులు చేసి ఇనాక్టివ్గా మార్చారు. ఈ చేడాక్స్కు కరోనా వైరస్లోని కొమ్ముల్లో ఉండే స్పైక్ గ్లైసోప్రొటీన్లను కలిపి చేడాక్స్1ఎన్కొవ్19కు రూపునిచ్చారు. కరోనా వైరస్ ఏసీఈ2 రిసెప్టర్లకు అతుక్కుని ఇన్ఫెక్షన్ సోకుండా ఉండేలా ఈ వ్యాక్సిన్ కాపాడుతుంది.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఫండ్స్
టీబీ మందుతో వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పని చేస్తోంది. జర్మనీలోని మాక్స్ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ బయాలజీ సహకారం అందిస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీకి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఆర్థిక సాయం చేస్తోంది. అనుమతులు, ముడి సరుకు విషయంలోనూ సాయం చేయనుంది. వ్యాక్సిన్పై ఎలాంటి పేటెంట్ తీసుకోబోమని, ప్రజలను కాపాడడమే తమకు ముఖ్యమని ఇటీవల కంపెనీ సీఈవో ప్రకటించారు. వ్యాక్సిన్ తయారీని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ సమన్వయం చేస్తుంది. వ్యాక్సిన్ తయారు చేసే అన్ని కంపెనీలకూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నోడల్ ఎజెన్సీగా ఉంటుంది. హైదరాబాద్కు చెందిన ఆంకో సీక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఊపిరితిత్తుల ఆధారంగా మందుల తయారీపై దృష్టి పెట్టింది. కరోనా ఎఫెక్ట్ లంగ్స్పైనే ఉండడంతో అదే మోడల్ను ఎంచుకుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల యాంటీబాడీలను బేస్ చేసుకుని వ్యాక్సిన్ తయారు చేసేందుకు సిద్ధమవుతోంది విర్కోవ్ బయోటెక్ కంపెనీ.
1,100 మందిపై ట్రయల్స్
ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్పై థేమ్స్ వ్యాలీ రీజియన్లో ట్రయల్స్ జరుగుతున్నాయి. 18 నుంచి 55 ఏళ్ల వయసున్న1,102 మందిపై ప్రయోగాలు చేయనున్నారు. అది కూడా వైరస్ సోకని ఆరోగ్యవంతమైన వాళ్లనే అందుకు ఎంచుకున్నారు. అందులో ఇప్పటికే తొలి డోస్ను ఓ మహిళకు ఇచ్చారు. వలంటీర్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. సగం మందికి చేడాక్స్1ను, మరో సగం మందికి మెనింజైటిస్ (మెదడు ఇన్ఫెక్షన్)ను అడ్డుకునే మెనింజైటిస్ వ్యాక్సిన్ ‘మెన్ఏసీడబ్ల్యూవై’ని ఇస్తారు. అయితే, ఎవరికి ఏ వ్యాక్సిన్ ఇచ్చారో మాత్రం చెప్పారు. అసలు ట్రయల్ స్టార్ట్ కావడానికి ముందు పది మంది వలంటీర్లకు నాలుగువారాలకుగానూ రెండు డోసుల చేడాక్స్1ను ఇచ్చి టెస్ట్ చేస్తున్నారు. ఈ ట్రయల్స్ అన్నీ జెన్నర్ ఇనిస్టిట్యూట్లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సారా గిల్బర్ట్ నేతృత్వంలో జరుగుతున్నాయి. 80 శాతం ఈ వ్యాక్సిన్ సక్సెస్ అవుతుందని ఆమె చెబుతున్నారు. ట్రయల్స్ తొలి దశలో భాగంగా వచ్చే నెలలో 800 మందిపై ప్రయోగం మొదలుపెట్టనున్నారు. వాళ్లలో యాంటీ బాడీల తయారీ, రిసెప్టర్ ప్రొటీన్లలో మార్పుల వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే ఆఫ్రికా దేశాల్లోనూ ట్రయల్స్ చేసేందుకు యూనివర్సిటీ టీం రెడీ అవుతోంది. ముందుగా కెన్యాలో ఆ ప్రయోగాలు చేయనున్నారు. కెన్యా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరిపి టెస్టులు చేస్తారు. ఆక్స్ఫర్డ్, ఇంపీరియల్ కాలేజీల వ్యాక్సిన్ డెవలప్మెంట్కు బ్రిటన్ సుమారు రూ.377 కోట్లు (4 కోట్ల పౌండ్లు) కేటాయించింది.
ఎయిమ్స్లో సెప్సిస్ మందుపైనా..
ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ భోపాల్, చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లు సెప్సిస్ను తగ్గించే ‘సెప్సివాక్’ డ్రగ్పైనా పరిశోధనలు చేయబోతున్నాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనేందుకు రక్తంలోకి మన బాడీ కొన్ని కెమికల్స్ను విడుదల చేస్తుంది. దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే సెప్సిస్ కిందకు దారితీస్తుంది. ఒంట్లోని అవయవాలపై ఎఫెక్ట్ పడుతుంది. దానిని అడ్డుకునే సెప్సివాక్నే కరోనా ట్రీట్మెంట్కు వాడబోతున్నాయి ఆయా సంస్థలు. మూడు ఆస్పత్రుల్లోని 50 మందికి ఆ మందును 0.3 మిల్లీ లీటర్లకు వరకు ఇస్తారు. ఆరు నెలల పాటు పరీక్షిస్తారు. ఈ మందుతో శరీరానికి ఉండే సహజమైన రక్షణ గుణాన్ని సెప్సివాక్ పెంచుతుందని భావిస్తున్నారు. దీంతో కరోనా పేషెంట్ల మరణాల రేటును తగ్గిస్తుందని, త్వరగా కోలుకునేలా చేస్తుందని అంటున్నారు. అంతేగాకుండా కరోనా పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్లనూ కాపాడుతుందని చెబుతున్నారు.
సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ట్రయల్స్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలాలు కలిసి 2007లో పబ్లిక్ప్రైవేట్ పార్ట్నర్ షిప్ కింద సెప్సివాక్ను తయారు చేశాయి. సెప్సిస్ మరణాల రేటును 50% వరకు తగ్గించిన ఈ సెప్సివాక్ను కరోనా పేషెంట్లపై వాడేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్లు అనుమతిచ్చాయి. సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోనే 3 ఆస్పత్రులు ట్రయల్స్ చేయనున్నాయి. 6 నెలల పాటు ట్రయల్స్ సాగుతాయి. ఈ రిజల్ట్ను బట్టే దానిని కరోనా పేషెంట్లకు వాడేది లేనిది తేలుస్తామని సైంటిస్టులు అంటున్నారు. ‘‘కరోనా పేషెంట్లలో అవయవాలు ఫెయిల్ కాకుండా ఈ మందు కాపాడుతుంది. చనిపోయే ముప్పును త్గగిస్తుంది’’ అని డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వీజీ సోమానీ చెప్పారు.
మనమెక్కడున్నం?
వ్యాక్సిన్ తయారీకి మన దేశ కంపెనీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో 16 ప్రాజెక్టులకు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆమోదం తెలిపాయి. 70 కంపెనీలు వ్యాక్సిన్ల తయారీపై పనిచేస్తున్నా.. 6 కంపెనీలవి ముందున్నాయి. వీటిలో 3 సంస్థలు హైదరాబాద్వే కావడం విశేషం. జైడస్ క్యాడిలా 2 వ్యాక్సిన్లపై పనిచేస్తోంది. ఆల్ఫా2బీ ఇంటర్ఫెరాన్తో వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉంది. రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ, రివర్స్ జెనెటిక్ టెక్నాలజీలతో వ్యాక్సిన్లను డెవలప్ చేస్తోంది. రేబిస్ వైరస్, ఫ్లూలను వెక్టార్లుగా వాడుకుంటూ కరోనాను చంపే వ్యాక్సిన్లపై అమెరికాకు చెందిన ఫ్లూజెన్ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్తో కలిసి ప్రయోగాలు చేస్తోంది భారత్ బయోటెక్. ఈ రెండు కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో లీడింగ్లో ఉన్నాయి.