ఒంటరి యువత కోసం లవ్ ట్రైన్

ఒంటరి యువత కోసం లవ్ ట్రైన్

బీజింగ్: చైనా.. అత్యధిక జనాభా ఉన్న దేశం. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అగ్రదేశం అమెరికాను ఢీకొంటున్న డ్రాగన్. టెక్నాలజీ నుంచి ఒలింపిక్స్ వరకు అన్ని రంగాల్లో ముందుంటుంది. ఎప్పుడూ బిజీ. ఉరుకులు పరుగుల జీవితం గడుపుతూ ఉంటుంది. ఈ పోటీలో పడి హ్యాపీగా బతకడం మరిచిపోయింది. ఒంటరితనం అనుభవిస్తోంది. ఎన్నోఏళ్ల కిందట నాటి ‘ఒక్కరు చాలు’ పాలసీ కూడా ఇందుకు తోడైంది. దీంతో లక్ష రెండు లక్షలు కాదు.. చైనాలో ఏకంగా 20 కోట్ల మందికిపైగా సింగిల్​గానే ఉన్నారట. దీంతో అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన యూత్ వింగ్.. యువతీ, యువకులను కలిపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. విచిత్రమైన కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘లవ్​ట్రైన్’

మూడేళ్ల కిందట..

లవ్ ట్రైన్.. ఐ999… లవ్ పర్స్యూట్.. పేరు ఏదైనా ఉద్దేశం ఒకటే. ఒంటరి పక్షులను జంటగా మార్చడం. మూడేళ్ల కిందట రైలు సర్వీసు ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే ఈ రైలు బయలుదేరింది. 3 వేల మంది జర్నీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 10న చోంగ్​క్వింగ్​నార్త్ స్టేషన్​నుంచి కియాంజియాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు రైలు బయలుదేరింది. రెండు పగళ్లు, ఒక రాత్రి ఈ ప్రయాణం సాగుతుంది. యువత తమకు లైఫ్​పార్ట్ నర్​గా సరిపోయే వాళ్లను ఎంచుకోవచ్చు. రైలులో ఉన్న వారిలో ఎవరైనా నచ్చితే స్నేహం చేయొచ్చు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. లేకుంటే ఫ్రెండ్స్​గా ఉండొచ్చు. లేదా జర్నీ పూర్తయ్యాక ఎవరిదారి వాళ్లు చూసుకోవచ్చు. వీరందరికి రైలులోనే భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. బోర్​కొట్టకుండా ఎంటర్​టైన్​మెంట్​ప్రోగ్రామ్స్​కూడా ఉంటాయి. నిజానికి ఈ వెరైటీ ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తోందట. వందలాది మందిని ఒకేచోటుకు చేర్చిందట. లవ్ పర్స్యూట్ ట్రైన్​లో ప్రయాణించిన 10 జంటలు పెళ్లి చేసుకున్నాయట.