
- పాక్, చైనా రక్షణ వ్యవస్థలపై అమెరికా యుద్ధ నిపుణుడు జాన్ స్పెన్సర్
న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ మిసైల్ ముందు చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ మాత్రం సరితూగవని అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ యుద్ధ నిపుణుడు పేర్కొన్నాడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ ముందు జుజూబీ అంటూ.. భారత మిసైల్ సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాకు చెందిన కర్నల్ (రిటైర్డ్) జాన్ స్పెన్సర్ ఓ మీడియా చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్లో ఎప్పుడైనా, ఎక్కడైనా దాడి చేయగలమనే బలమైన సందేశాన్ని ఇండియా పంపిందన్నారు. పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు, భారత బ్రహ్మోస్ క్షిపణులకు సరితూగవని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్లోని ఉగ్రవాద శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడులకు భారత్ ఈ మిసైల్ను ఉపయోగించిందని.. కానీ, వాటిని అడ్డుకోవడంలో పాక్, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేతులేత్తేసిందని పేర్కొన్నారు.
ఒకే సమయంలో పాకిస్తాన్లోని వేర్వేరు ప్రాంతాల్లో దాడి చేయడం.. అలాగే పాక్ డ్రోన్ దాడులు, హై-స్పీడ్ క్షిపణులను భారత్ విజయవంతంగా ఎదుర్కొందని ప్రశంసించారు. "చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు భారతదేశ వ్యవస్థలతో పోలిస్తే తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయి. బ్రహ్మోస్ క్షిపణి చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించింది. పాకిస్తాన్లోని ఏ ప్రదేశంలోనైనా ఎప్పుడైనా దాడి చేయగలమనే భారత్ సందేశం స్పష్టంగా ఉంది" అని స్పెన్సర్ పేర్కొన్నారు.