సమాజానికి తిరిగిచ్చేయాలె ..

సమాజానికి తిరిగిచ్చేయాలె ..
  • సంపన్నులకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ఆర్డర్స్​

బీజింగ్​: సంపన్నులపై చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ దృష్టి పెట్టారు. డబ్బున్నోళ్ల సంపదను సమాజానికి ఎంతో కొంత పంచాలని నిర్ణయించారు. ఇప్పటికే వారికి దీనిపై మెసేజ్​ కూడా ఇచ్చారు. చైనా లీడర్​షిప్​ ఎకనామిక్​ సమావేశం సందర్భంగా ఆయన దీనిపై చైనా కమ్యూనిస్ట్​ పార్టీ నేతలకు సూచనలు చేశారు. సామాజిక అంతరాల్లేకుండా సంపదను సమాజానికి పంచాలని చెప్పారు. ధనవంతుల సంపద, ఆదాయాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సమాజానికి తిరిగిచ్చేయాలంటూ ధనికులకు ఆయన తేల్చి చెప్పారు. కొందరి అభివృద్ధితో దేశం బాగుపడదని, అందరూ బాగుపడితేనే 2049 నాటికి చైనా ధనిక దేశంగా, పూర్తి అభివృద్ధి సాధించిన దేశంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. పన్నులు, ఇతర మార్గాల్లో ధనికుల సంపదను సమాజానికి పంచేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చైనా లో ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయి. ఓ సామాన్యుడి ఆదాయంతో పోలిస్తే డబ్బున్నోడి ఆదాయం అంతకంతకూ పెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చాలా సంస్థలపై ఆంక్షలను విధిస్తూ వస్తున్నారు.