ఇండియా మార్కెట్లో..చైనా టీవీలకు తగ్గుతున్న గిరాకీ

ఇండియా మార్కెట్లో..చైనా టీవీలకు తగ్గుతున్న గిరాకీ

న్యూఢిల్లీ: మన దేశంలో చైనా టీవీ బ్రాండ్ల హవా తగ్గుతోంది. డ్రాగన్ మెల్లమెల్లగా​ కనుమరుగవుతోంది.  టీవీ మార్కెట్లలో లోకల్/కొరియన్​​ బ్రాండ్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఎల్జీ, శామ్​సంగ్​ల మార్కెట్​ వాటా భారీగా పెరుగుతోంది. ఇవి ఇండియన్‌ కస్టమర్లకు నచ్చేలా తమ ప్రొడక్టులను డిజైన్​ చేస్తున్నాయి.   ధరలనూ తగ్గిస్తున్నాయి. రియల్​మీ, వన్​ప్లస్​ వంటి చైనీస్​ బ్రాండ్లు త్వరలోనే ఇండియాలో దుకాణం సర్దేయడమో లేదా నామ్​ కే వాస్తేగా కొనసాగడమో చేస్తాయని టీవీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలకు పంపిన ఈ–మెయిల్స్​కు జవాబు రాలేదు. 

కౌంటర్​ పాయింట్​ టెక్నాలజీ లేటేస్ట్​ రిపోర్ట్​ ప్రకారం ఇండియాలో చైనా బ్రాండ్ల వాటా గత జూన్​ క్వార్టర్​లో 35.7 శాతం ఉండగా, ఈ ఏడాది జూన్​ క్వార్టర్​లో ఇది 33.6 శాతానికి తగ్గింది. రాబోయే క్వార్టర్లో ఇది 30 శాతానికి పడిపోయే అవకాశాలూ ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. శామ్‌సంగ్‌​, ఎల్జీ, సోనీ మిడ్​సెగ్మెంట్​లో తీసుకొస్తున్న  మోడల్స్​ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాన్​సూయి, ఏసర్​  బ్రాండ్ల టీవీలనూ బాగానే కొంటున్నారు” అని కౌంటర్​పాయింట్​ సీనియర్​ ఎనలిస్ట్​అన్షికా జైన్​ చెప్పారు. ఎలక్ట్రానిక్ రిటైల్ చైన్ గ్రేట్ ఈస్టర్న్ రిటైల్ డైరెక్టర్ పుల్కిత్ బైడ్ మాట్లాడుతూ టెలివిజన్ మార్కెట్లలో చాలా మార్పులు వస్తున్నాయని చెప్పారు. లాయిడ్​ వంటి బ్రాండ్లు దూకుడు ప్రదర్శిస్తుండగా, ఇంతకుముందు బాగా చొచ్చుకుపోయిన చైనీస్ బ్రాండ్లు ఇప్పుడు నష్టాలను మూటగట్టుకుంటున్నాయని వివరించారు.

స్మార్ట్​ఫోన్లలోనూ తగ్గుతున్న చైనా  వాటా

స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లలో  చైనీస్ బ్రాండ్‌‌‌‌లు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ నుంచి తప్పుకున్నాయి. గత నాలుగు క్వార్టర్లలో వీటి అమ్మకాలు బాగా తగ్గాయి. ముఖ్యంగా రూ. 7,000–-8,000 కంటే తక్కువ ధరల ఫోన్ల సెగ్మెంట్లలో చైనీస్​ బ్రాండ్లకు ఆదరణ ఉంది. ఇవి ఎంట్రీ లెవెల్ ​ఫోన్లను వదిలేసి ప్రీమియంవైపు వెళ్తున్నాయి. శామ్‌‌‌‌సంగ్, యాపిల్ వంటి కంపెనీలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నాయి. మార్జిన్‌‌‌‌లను పెంచుకోవడానికి మిడ్ -టు -ప్రీమియం సెగ్మెంట్​పై ఎక్కువగా ఫోకస్​ చేస్తున్నాయి.  స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లలో చైనా బ్రాండ్ల సంఖ్య ఎక్కువగా ఉండగా, టీవీల విభాగంలో తక్కువగా ఉన్నాయి. షావోమీ, వన్​ప్లస్, రియల్​మీ, టీసీఎల్‌​ వంటి చైనీస్ బ్రాండ్‌‌‌‌లు 2017-–18 నుంచి గత కొన్ని క్వార్టర్ల వరకు భారతీయ టీవీ మార్కెట్‌‌‌‌ను శాసించాయి.

 ఎల్జీ, శామ్​సంగ్, సోనీ కంటే 30–-50 శాతం తక్కువ ధరలకు టీవీలు అందుబాటులో ఉండటం వల్ల  త్వరగా మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దీంతో అనేక పెద్ద బ్రాండ్లు మార్కెట్​ నుంచి వెళ్లిపోయాయి లేదా ధరల పోటీ తీవ్రంగా ఉన్న ఎంట్రీ సెగ్మెంట్ మోడల్‌‌‌‌లపై దృష్టి తగ్గించాయి. “చైనీస్ టీవీ బ్రాండ్‌‌‌‌ల వ్యూహం ఏంటంటే వేగంగా మార్కెట్ వాటాను పొందడానికి ధరలను తగ్గించడం. దీంతో వారి నష్టాలు పెరుగుతున్నాయి.  టెలివిజన్ ప్యానెల్ ధరలు చాలా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాభాలు పొందడం చాలా  కష్టం ” అని భారత దేశంలో కోడాక్, థామ్సన్ , బ్లూపంక్ట్  బ్రాండ్ల స్మార్ట్​టీవీలను అమ్మే నోయిడాకు చెందిన ఎస్​పీపీఎల్​ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవనీత్ సింగ్ మార్వా అన్నారు. చైనీస్ బ్రాండ్లు  అత్యంత కీలకమైన ఫోన్‌ మార్కెట్‌పై దృష్టి సారించడానికి టెలివిజన్ అమ్మకాలను పెద్దగా పట్టించుకోవడం లేదని మార్వా చెప్పారు. దీంతో ఇతర బ్రాండ్లు  పుంజుకోవడానికి, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఇది గొప్ప అవకాశమని వివరించారు.