విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రధాని మోడీని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా.. సినిమాలకే పరిమితమైపోయిన ఆయన చాలా కాలం తర్వాత ప్రజల సమస్యలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. నష్టాల్లో ఉందని విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి విషయం తెలియజేసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని మరీ కేంద్రం ప్రకటించడం పెద్ద కలకలం రేపింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యోగులతోపాటు ఏపీలోని అధికార వైసీపీ సహా అన్ని పక్షాల నాయకుల మద్దతుతో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కార్మికులు తిరిగి పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో చేరి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారు చేసి దేశమంతా సరఫరా చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక రైలు విశాఖ చేరుకున్న సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ దేశమంతా ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని.. అలాంటి విశాఖ ఉక్కు కర్మారాన్ని నష్టాల్లో ఉందని ప్రైవేటుపరం చేయడం ఎంత వరకు సమంజసం మీరే ఆలోచించండి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021