
మహిళా అసిస్టెంట్ ను లైంగికంగా వేధించిన కేసులో కొరియోగ్రాఫర్ జానీని హైదరాబాద్ పోలీసులు గోవాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గోవా నుండి రోడ్డు మార్గాన జానీని హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఎస్ఓటీ పోలీసులు. శుక్రవారం ( సెప్టెంబర్ 20, 2024 ) తెల్లవారుజామున 4గంటలకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు జానీని నార్సింగి పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం నార్సింగి పొలిసు స్టేషన్లో జానీని విచారిస్తున్నారు పోలీసులు.జానీని రహస్యంగా విచారిస్తున్న పోలీసులు ఇవాళ ( సెప్టెంబర్ 20, 2024 ) ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో నేరం రుజువైతే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు నాలుగు స్పెషల్ టీమ్స్తో గాలించారు. జానీ మాస్టర్ను అరెస్ట్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్కు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి.
ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య సుమలతపై కూడా ఆరోపణలు రావడంతో నార్సింగి పోలీసులు ఆమెను పలుమార్లు విచారించారు. జానీ మాస్టర్ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆమె భర్త ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు గోవాకు వెళ్లి జానీని అరెస్ట్ చేశారు.