ఏపీ మాజీ మంత్రి నారాయణ ఆఫీసులో సీఐడీ సోదాలు

ఏపీ మాజీ మంత్రి నారాయణ ఆఫీసులో సీఐడీ సోదాలు

అమరావతిలో అసైన్డ్  భూముల కొనుగోలుపై తనిఖీలు

మాదాపూర్​, వెలుగు : ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి నారాయణ ఆఫీసులో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్​లో మెలాంజ్​ టవర్స్​లోని  పదో  ఫ్లోర్​లో ఉన్న ఎన్ఎస్​పీఐఆర్ఏ అఫీస్​కు దాదాపు 40 మంది ఏపీ సీఐడీ అధికారుల బృందం మంగళవారం ఉదయం 10 గంటలకు చేరుకొని సోదాలు చేసింది. అమరావతిలో అసైన్డ్​ భూముల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలపై 40 మంది అధికారుల బృందం తనిఖీలు చేసింది.

నారాయణ విద్యా సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్​ సంస్థల్లోకి నిధుల మళ్లింపు, ఆ నిధులతోనే నారాయణ  బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు సోదాలు చేసినట్లు తెలిసింది. ఆఫీసులో​పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను వారు ప్రశ్నించారు. కంపెనీకి చెందిన 40 హార్డ్​డిస్కులను స్వాధీనం చేసుకున్నారు.