అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగ్ల సమస్యను పరిష్కరించడంలో విఫలమైనందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)ని కర్ణాటక హైకోర్టు గట్టిగా మందలించింది. పౌర సంస్థను నగరానికి "నంబర్ 1 శత్రువు" అని విరుచుకుపడింది.
బెంగళూరులోని అన్ని ఫ్లెక్సీలు, హోర్డింగ్లను సమగ్రంగా సర్వే చేయాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్ల సంఖ్యను గుర్తించడమే సర్వే లక్ష్యం అని కోర్టు వెల్లడించింది. సర్వే ఫలితాలను 28 రోజుల్లోగా సమర్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ తెలిపారు. అక్రమ బిల్బోర్డ్ల పెరుగుదల కారణంగా ఉన్న సమస్యలను హైలైట్ చేస్తూ, బీబీఎంపీ లోపాల వల్ల ప్రకటనల నుంచి కోల్పోయిన పన్నుల భారం చివరికి ప్రజలపైనే పడుతుందని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది.
ఈ విషయంలో బిల్బోర్డ్ల నుంచి పన్నులు వసూలు చేయడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అవసరమైన పౌర సేవలకు నిధులు కేటాయించడంలో BBMP పోరాడుతున్నట్లు కనిపిస్తోందని కోర్టు గమనించింది. ఇది BBMPలో క్లిష్టమైన ఆర్థిక లోటుకు దారితీసింది. ఇది బెంగళూరు మొత్తం అభివృద్ధిని ప్రభావితం చేసింది. చట్టవిరుద్ధమైన ప్రకటనల వ్యాప్తితో నగర సౌందర్యం కూడా దెబ్బతింటుందని కర్ణాటక హైకోర్టు వివరించింది.