
- ..తీసుకున్న వడ్లు.. ఇచ్చిన సీఎంఆర్
- ఎప్పుడు ఎక్కడెక్కడికీ.. ఏసీకేల వారీగా లెక్కలు చెప్పాలన్న సివిల్ సప్లై శాఖ
- ఎఫ్ఆర్కే డిటైల్స్, గన్నీ బ్యాగుల లెక్కలు కూడా
- అక్టోబర్ 10 డెడ్లైన్.. మిల్లర్లకు సివిల్ సప్లయ్ ఆర్డర్స్
యాదాద్రి, వెలుగు: ఐదేండ్ల నుంచి ఇప్పటివరకూ తీసుకున్న వడ్లు, ఇచ్చిన బియ్యం, పెండింగ్ డిటేల్స్ చెప్పాలని మిల్లర్లకు సివిల్సప్లయ్ శాఖ డెడ్లైన్ విధించింది. వడ్ల కొనుగోలు.. సీఎంఆర్ విషయంలో కొందరు మిల్లర్లు తరచూ సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ను తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వడ్ల కొనుగోలుపై ఎంత సహకరించినా.. గన్నీలు సరిగా లేవని, వడ్లు మంచిగా లేవంటూ కొర్రీలు పెడుతుంటారు. సీఎంఆర్ విషయంలో వాయిదాలు పెడుతూనే ఉన్నారు. దీంతో లెక్కల విషయంలో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్కు స్పష్టత లేకుండా పోతోంది. అందుకే పూర్తి స్థాయిలో లెక్కలు వెల్లడించాలని మిల్లర్లను కోరింది.
ఐదేండ్లు.. 11 సీజన్లు
2019-–20 యాసంగి సీజన్ నుంచి 2024-–25 యాసంగి సీజన్ వరకూ పూర్తి స్థాయిలో లెక్కలు వెల్లడించాలని మిల్లర్లను సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ కోరింది. ఈ లెక్కన మొత్తంగా 11 సీజన్లకు సంబంధించిన లెక్కలను మిల్లర్లు వెల్లడించాల్సి ఉంది. ప్రతీ సీజన్లో తీసుకున్న వడ్లు, అప్పగించాల్సిన సీఎంఆర్తో పాటు ఎఫ్సీఐకి అందించిన బియ్యం లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ అందించిన బియ్యంతో పాటు లేకుండా అందించిన లెక్కలు విధిగా వెల్లడించాల్సిందే. ఏసీకే (29 టన్నులు) నెంబర్ల వారీగా మిల్లు నుంచి ఏ గోదాముకు ఎప్పుడు పంపించారో పేర్కొనాల్సి ఉంటుంది.
పెండింగ్ ఉన్న సీఎంఆర్ లెక్కలను కూడా చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా సివిల్ సప్లయ్ అందించిన ఎఫ్ఆర్కే ఎంత స్టాక్ ఉందో కూడా లెక్కలు చెప్పాలి. వీటితో పాటు ప్రతీ సీజన్ కొనుగోలు సమయంలో మిల్లర్లకు లక్షల సంఖ్యలో గన్నీ బ్యాగులను అందించాల్సి ఉంటుంది. ప్రతి సీజన్లో కొత్త వాటిని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటోంది. అయితే పాత గన్నీ బ్యాగులు ఉన్నయా..?లేవా..? అన్న లెక్కలు సరిగా లేవంటున్నారు. ఇప్పుడు వీటి లెక్కలను కూడా మిల్లర్లను డిపార్ట్మెంట్ అడుగుతోంది.
వచ్చే నెల 10లోగా
జిల్లాలోని 52 మంది మిల్లర్లు తాము తీసుకున్న వడ్లు, ఇవ్వాల్సిన సీఎంఆర్ లెక్కలను సీజన్ల వారీగా అక్టోబర్ 10లోగా వెల్లడించాలని డిపార్ట్మెంట్ డెడ్లైన్ విధించింది. 11 సీజన్లకు సంబంధించిన లెక్కలు కొందరు మిల్లర్ల వద్ద రెడీగా ఉన్నప్పటికీ..మరిరొందరి వద్ద లెక్కలు సరిగా లేవని అంటున్నారు. దీంతో జిల్లాలో రెండు మిల్లులు డిఫాల్టర్లుగా ఉన్నాయి. ఒక మిల్లుపై ఇప్పటికే రెవెన్యూ రికవరి (ఆర్ఆర్) యాక్ట్ పెట్టారు. ఆ మిల్లు ఓనర్ చనిపోయాడు. బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
మరో మిల్లును సీజ్ చేశారు. ఈ రెండు మిల్లుల వద్దే రూ. 15 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయి. వీటికి సంబంధించిన లెక్కలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మిల్లర్ల నుంచి లెక్కలు తీసుకోవడం వల్ల వడ్లు, బియ్యం ఇచ్చిన విషయంలో మరింత స్పష్టత వస్తుందని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు భావిస్తున్నారు.