న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తంచేశారు. చాలా వరకు కేసుల్లో నిందితుడు కుటుంబంలోని వ్యక్తే కావడంతో విషయం బయటికి రావడంలేదన్నారు. అలాంటప్పుడు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్పైనే ఉంటుందని చెప్పారు. ‘పోక్సో చట్టం’పై ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యక్రమానికి సీజేఐ హాజరై మాట్లాడారు. నిందితుడు ఫ్యామిలీ మెంబర్ అయినా సరే కేసు పెట్టేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ వల్ల బాధితులు మానసిక క్షోభకు గురికావడం దురదృష్టకరమన్నారు.
సేఫ్.. అన్సేఫ్ టచ్పై అవగాహన కల్పించాలి
సరైన సమయంలోనే పిల్లలపై లైంగిక వేధింపులను గుర్తించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. దాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఏదో పిల్లలు గుర్తించేలా పేరెంట్స్ చూడాలన్నారు. అన్నింటికి మించి.. కుటుంబ గౌరవం కంటే పిల్లల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిందితుడు ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు చాలా మంది కేసు రిజిస్టర్ చేయడంలేదన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. మైనర్ల అంగీకారంతో లైంగికంగా కలిసినా సరే అది నేరమేనని తెలిపారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారన్నారు.