బషీర్బాగ్, వెలుగు: దేశంలో బీసీల రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకుడు దాసు సురేశ్ ఆరోపించారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బీసీల రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని దాసు సురేశ్ డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల వల్ల అగ్రకులాలకు చెందిన మహిళలే లాభపడతారని.. అణగారిన వర్గాలకు చెందిన మహిళ లకు అవకాశం ఇవ్వరని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ.. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అగ్ర కులాలకు చెందిన మహిళల కోసమే మహిళా బిల్లు తెచ్చారని.. ఎమ్మెల్సీ కవిత ఈ బిల్లు కోసమే ధర్నాలు చేసిందని ఆయన ఆరోపించారు.
మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన
ముషీరాబాద్: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం అంబర్పేట్లోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద బీసీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ... బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం అంటే బీసీలకు.. కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేయడమేనన్నారు.