దారుణం.. పదేళ్ల బాలికపై మైనర్ల అత్యాచారం

దారుణం.. పదేళ్ల బాలికపై మైనర్ల అత్యాచారం
  • సోషల్ మీడియాలో వైరలయిన వీడియో
  • మూడు వారాల తర్వాత ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
  • హర్యానాలోని రేవారీ జిల్లాలో ఘటన

అభంశుభం తెలియని పసిదానిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది చేసింది అన్నీ తెలిసిన పెద్దవాళ్లేం కాదు. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా మైనర్లే. ఈ దారుణ ఘటన హర్యానాలోని రేవారీ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక అయిదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం స్కూల్స్ లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటోంది. బాలిక గత నెల మే 24న ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఓ 18 ఏళ్ల యువకుడు కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి ఎవరూ లేని స్కూల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతనితో ఉన్న మరో ఎనిమిది మైనర్ బాలురు కూడా బాలికపై అత్యాచారం చేశారు. ఇందులో అయిదుగురు బాలిక కుటుంబానికి బాగా కావలసిన వాళ్లు కావడం గమనార్హం. ముఖ్యంగా నిందితులలో మైనర్ల వయసు 10 నుంచి 12 ఏళ్లు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా.. బాలికపై జరిగిన అత్యాచారాన్ని మైనర్లలో ఇద్దరు వీడియో తీశారు. ఈ వీడియోను వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయడంతో వైరల్ అయింది. ఘటన జరిగిన మూడు వారాల తర్వాత ఈ వీడియో బాలిక తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. దాంతో బాలిక తల్లిదండ్రులు జూన్ 9న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వీడియో ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

చిన్నతనంలోనే బాలురు ఇటువంటి అకృత్యాలకు పాల్పడటం అందరిని ఆలోచనలో పడేసింది. సోషల్ మీడియా, యూట్యూబ్, పోర్న్ వీడియోల ప్రభావంతోనే పిల్లలు దారుణాలకు తెగబడుతున్నారని చైల్డ్ సైకాలజిస్ట్‌లు అంటున్నారు.