చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు దత్తపుత్రుడు, వదిన: సీఎం జగన్

చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు దత్తపుత్రుడు, వదిన: సీఎం జగన్

చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా ఉన్నారని సీఎం జగన్ అన్నారు. మోసాలు చేయడమే ఆయన చరిత్రని.. పక్క రాష్ట్రాల్లో ఉండే దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. చంద్రబాబు వదిన కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినరేనన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం(జనవరి 23) సీఎం జగన్ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

గతంలో మహిళల గురించి ఆలోచించి వారికి సహాయం చేసిన ప్రభుత్వాలు లేవని సీఎం జగన్ విమర్శించారు. గతంలో ప్రజాధనం దోచుకోవడం మాత్రమే ఉండేదని.. 2014 ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని తెలిపారు.  

మహిళా సాధికారతకు వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం జగన్ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మహిళల కోసం.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమం పూర్తి చేయబోతున్నామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ. 31 వేల కోట్లు బదిలీ చేశామని తెలిపారు. 56 నెలల్లో మహిళా సాధికారత కోసం అనేక పథకాలు చేపట్టామని.. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ. 14,129 కోట్లు బదిలీ చేశామన్నారు.

సున్నా వడ్డీ ద్వారా కోటి 5 లక్షలు మహిళల ఖాతాల్లోకి రూ. 4968 కోట్లు బదిలీ చేశామని జగన్ తెలిపారు. లంచాలకు తావు లేకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటికే పెన్షన్ డబ్బులు అందుతున్నాయన్నారు. రూ. 6400 కోట్లు పొదుపు సంఘాలకు ఇస్తున్నామని వివరించారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని.. ముఖ్యమంత్రి మారడం వల్లే ఈ పథకాలన్ని అమలవుతున్నాయని చెప్పారు.