భారీ వర్షాలు, వరదలతో సిటీలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. 15 ప్రత్యేక బృందాలు చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ… అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే విషయంపై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో మాట్లాడారు సీఎం కేసీఆర్. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయన్నారు . దీంతో సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయన్నారు సీఎం.
వరుస అల్పపీడనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చెరువుల విషయంలో అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని అదేశించారు సీఎం. చెరువులకు గండిపడటం… కట్టలు తెగడం లాంటివి జరగకుండా చూసుకోవాలన్నారు . ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ గండ్లు పడినా… కట్టలు తెగినా మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.