
చింతమడక సర్పంచ్ హంసకేతన్ రెడ్డితో సీఎం కేసీఆర్ జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండ్రోజుల క్రితం సర్పంచ్ కు సీఎం ఫోన్ చేసి గ్రామాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సర్వేతోపాటు ఇతర ప్రణాళికలపై మాట్లాడారు. “ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయల లాభం చేకూరేలా చూడాలి. ట్రాక్టర్లు కావాలన్నోళ్లకు ట్రాక్టర్లు, ప్లాంటేషన్ మిషన్, హర్వెస్టర్ మిషన్ ఏది కావాలంటే అది ఇప్పియి. బతుకుదెరువు పోయినోళ్ల పేర్లు రాపించు. కావాలన్నోళ్లకు పింఛన్లు ఇయ్యి. డీసీఎం కావాలన్నోనికి డీసీఎం ఇప్పించు. నువ్వు ఇప్పించిన తెల్లారినుంచే గవర్నమెంట్ నుంచి సాంక్షన్ ఇప్పిస్త. ఎవరికి ఏముందో నువ్వు నిలబడి రాపించు. ప్రతి కుటుంబానికి సాయం చేద్దాం. కులం లేదు, తలం లేదు. ధనిక, పేద తేడా లేకుండా ప్రతి కుటుంబానికి సాంక్షన్ చేద్దాం. ప్రతి ఇంటికి ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు లాభం జరగాలనుకో” అన్నారు. గ్రామంలో జేసీబీలు కావాలంటున్నారని సర్పంచ్ అనగానే జేసీబీలు కూడా ఇప్పించు, దేనికి వెనుకకు పోకు అని కేసీఆర్ అన్నారు. ఊర్ల ప్రతి ఇంటికి పది లక్షల బెనిఫిట్ జరగాలన్నది తన ఆలోచన అని.. పుట్టిన ఊరు కాబట్టి చెబుతున్నానని పలు అంశాలపై మాట్లాడారు.