
జనగామ జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను సిద్దంచేశారు. కొడకండ్లలో రైతు వేదికలను కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రకృతి వనం, రైతు వేదిక భవనం, సభ స్థలి పనులను మంత్రులు నిరంజన్ రెడ్డి. ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.
కొడకండ్ల మండల కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటలకు రైతు వేదికను ప్రారంభించిన తర్వాత.. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు సభావేదికలో పాల్గొననున్నారు. తర్వాత 5వేల మంది రైతులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి మాట్లాడనున్నారు. రైతు వేదికల ఉద్దేశం, వాటి ఆవశ్యకతను రైతులకు వివరిస్తారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.