- జోడో యాత్రతో కర్నాటక, తెలంగాణలో గెలిచినం
- కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు వందరోజులు కృషి చేయాలి
- పార్టీని అధికారంలోకి తెచ్చి దేశాన్ని కాపాడుకుందాం
- ప్రధాని మోదీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని విమర్శ
- నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: రాహుల్గాంధీ చేపట్టనున్న న్యాయ్ యాత్రతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే జోడో యాత్రతో కర్నాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, న్యాయ్ యాత్రతో మరింత ముందుకుసాగుతామని చెప్పారు. గురువారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్తలు ఓ వంద రోజులు పనిచేయాలని, ఈ వంద రోజుల పాటు కుటుంబానికి సెలవు పెట్టాలని సూచించారు. ‘‘దేశం కోసం పనిచేస్తామంటూ ఇంట్లో అమ్మ, నాన్న, అన్నా, చెల్లి, తమ్ముడు కుటుంబం అందరికీ చెప్పాలి. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి.
కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్గాంధీ జోడో యాత్ర చేశారని, 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. త్వరలో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ చేయనున్న భారత్ న్యాయ్ యాత్రతో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీన్ని 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆపలేరని పేర్కొన్నారు. ప్రతి మెడిసిన్కూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, ప్రధాని మోదీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని అన్నారు.
రాబోయే రోజుల్లో మోదీ మెడిసిన్ దేశంలో పనిచేయబోదని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ పదే పదే చెప్తున్నదని, అందులో ఒక ఇంజన్ అదానీ, మరో ఇంజన్ ప్రధాని అని విమర్శించారు. లోక్సభలో రాహుల్ గొంతెత్తడంతో అదానీ అనే ఇంజన్ పాడైపోయి షెడ్డుకు పోయిందన్నారు. ఇప్పుడు న్యాయ్ యాత్రతో మోదీ అనే ఇంజన్ కూడా పాడైపోయి షెడ్డుకు పోతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మోదీ చూస్తారని అన్నారు.
వేడుకకు రాష్ట్రం నుంచి పది వేల మంది
నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ నుంచి దాదాపు 10 వేల మంది హాజరయ్యారు. పార్టీ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు చాలా మంది ఇందులో పాల్గొన్నారు. వీరిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సీనియర్ నేతలు సంపత్ కుమార్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.