ఫేక్ న్యూస్​పై సీఎం సీరియస్.. సర్కారును బద్నాం చేస్తే సహించబోమని వార్నింగ్​

ఫేక్ న్యూస్​పై సీఎం సీరియస్.. సర్కారును బద్నాం చేస్తే సహించబోమని వార్నింగ్​

 

  • తప్పుడు​ ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
  • చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కామెంట్​
  • సీఎం ఆదేశాలతో అలర్ట్​ అయిన ఆఫీసర్లు
  • ఇప్పటికే కొందరిపై కేసులు.. విచారణ ప్రారంభించిన పోలీసులు 

హైదరాబాద్, వెలుగు:  సోషల్​ మీడియా వేదికగా ఇటీవల ఫేక్​ లెటర్లు, సర్క్యులర్లు, ఫొటోలు, వీడియోలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న వ్యవహారాన్ని సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​గా తీసుకున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా అసత్యాలు ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు, పోలీసులు అలర్ట్ ​అయ్యారు.  ఇప్పటికే  ఉస్మానియా వర్సిటీ సెలవులపై ఇచ్చిన సర్క్యులర్, ఆర్టీసీ ఫేక్​ లోగోలకు సంబంధించి బాధ్యులపై కేసులు పెట్టిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. వీటితోపాటు రాష్ట్రంలో కరెంట్​ కోతలపై, వివిధ ప్రభుత్వ సర్క్యులర్లను  మార్ఫింగ్​ చేసి ఫేక్​ న్యూస్​ వైరల్​చేసిన ఘటనల్లోనూ బాధ్యులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి లేనిది సృష్టించి సోషల్​ మీడియాలో పోస్టు చేయడం చట్టరీత్యా నేరమని,  ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఆయా శాఖల ఉన్నతాధికారులపై సీఎం సీరియస్​ అయినట్టు సమాచారం. ఇలాంటివి చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రజల మధ్య గొడవలకు, అల్లర్లకు దారి తీస్తుందని హెచ్చరించడంతో ఆయా శాఖల పరిధిలోని హెచ్​వోడీలు కింది స్థాయి ఉద్యోగులను అప్రమత్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఓయూ సర్క్యులర్​​ నుంచే మొదలు

గత నెలలో ఓయూ సర్క్యులర్​​ రిలీజ్​ అయినప్పటి నుంచే ఈ ఫేక్​ పోస్టుల పరంపర మొదలైంది.  మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్‌‌ వార్డెన్‌‌ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు వివాదాస్పదం చేశారు. గత కొన్నేండ్లుగా ఇస్తున్నట్లే వర్సిటీకి ఈ ఏడాది కూడా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో చీఫ్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నా..  నీటి సమస్య, కరెంటు కోతల అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ దుమారం రేపింది. ఉస్మానియా వర్సిటీకి గతేడాది కూడా మే 14 నుంచి జూన్‌‌‌‌‌‌‌‌ 4 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అప్పుడు సైతం నీటి, కరెంటు కోత సమస్యలతో సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉస్మానియా వర్సిటీ నోటీసు నెం.752/సీడబ్ల్యూఓ/హెచ్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఎం/ఓయూ/2023తో జారీ చేసింది. కానీ బీఆర్ఎస్​సోషల్​ మీడియా కన్వీనర్​ మన్నె క్రిశాంక్ .. పాత సర్క్యులర్​లో నీటి సమస్య, కరెంట్​ కోతల విషయం లేనట్లు మార్ఫింగ్​చేసి వైరల్​ చేయడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే కరెంట్​, నీటి సమస్యలు వచ్చాయనే తప్పుడు ప్రచారాన్ని పబ్లిక్​లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు. దీంతో క్రిశాంక్​ పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని, దానిపై నంబరు కూడా పెన్నుతో రాశారని, తన సంతకాన్ని సైతం కాపీ చేశారని ఓయూ చీఫ్​వార్డెన్ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్​పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియో తయారీలో కీలకంగా వ్యవహరించిన నాగేందర్​పై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం.  ఇటీవల ఆర్టీసీ లోగోకు సంబంధించి కూడా ఇలాంటి వివాదమే బయటకొచ్చింది. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ఇటీవల తమ పేర్లలో  టీఎస్​స్థానంలో టీజీ అని మార్చుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కూడా టీజీ సాకుతో పాత లోగోను మార్చిందని, అందులో తెలంగాణతనం లోపించిందని, కాకతీయ కళాతోరణం లేదంటూ ఫేక్​లోగో క్రియేట్​ చేసి వైరల్​ చేశారు. దీనిపైన సీఎం సీరియస్​కావడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇలా వరుసగా కరెంట్ కోతలు, వాటర్​ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని  బద్నాం చేసేలా రాజకీయ ప్రేరేపిత ఫేక్​ పోస్టులు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. నిరుడితో పోలిస్తే ఇదే సమయానికి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువ జరిగినా తక్కువ జరిగినట్లు చూపడం, దానిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం గమనార్హం. దీనిపై సంబంధిత శాఖ మంత్రి, అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

వదిలేస్తే హెచ్చు మీరుతుందని 

నిరుడు డిసెంబర్​ 7న కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సోషల్​ మీడియాలో ప్రభుత్వంపై  కొన్నివర్గాలు పనిగట్టుకొని దుష్ర్పచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లు సీఎం రేవంత్​ రెడ్డికి రిపోర్ట్​ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారడంతో ఫ్రస్ట్రేషన్​లో కొంతమంది అలా చేస్తుండొచ్చు అని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మొదట్లో సీఎం  లైట్​గా తీసుకున్నారు. కానీ రోజు రోజుకూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఫేక్​ ప్రచారం పెరుగుతూ పోవడం.. లేనిపోనిది జరుగుతున్నట్లు క్రియేట్​ చేయడంపై అటు ప్రభుత్వంలో, ఇటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఫేక్​న్యూస్​పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల హెచ్​వోడీలకు, పోలీస్​అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.