![మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/05/cm-revanth-reddy-respond-on-music-director-keeravani-for-telangana-state-song_cdMBAgfQ7W.jpg)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వేడుకలను ఘనంగా ప్లాన్ చేస్తోంది. వేడుకులకు సంబంధించిన ఏర్పాట్లును సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక రాష్ట్ర గీతం, కొత్త అధికారిక చిహ్నన్ని కూడా తీసుకురానున్నట్లు కాంగ్రెస్ సర్కార్ ఇది వరకే ప్రకటించింది.
ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. అధికారిక చిహ్నం మార్పుతో పాటు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటే త్యాగాలు,పోరాటాలు అని రాచరిక వ్యవస్థకు తావులేదన్నారు. తెలంగాణ తల్లి, గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందెశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని చెప్పారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తన పని కాదన్నారు. సంగీత దర్శకుడు ఎంపిక విషయంలో తనకేం సంబంధం లేదన్నారు సీఎం. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యతంతా అందెశ్రీదేనని చెప్పారు. తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ కు చెందిన వ్యక్తికి ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నన్ని రూపొందిస్తామన్నారు.