ఆందోళన వద్దు.. టెన్షన్ పడొద్దు : ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్ నిరంతర ప్రక్రియ

ఆందోళన వద్దు.. టెన్షన్ పడొద్దు : ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్ నిరంతర ప్రక్రియ

రాష్ట్రంలో కొత్తగా అమలు చేయబోతున్న 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మాకు రాలేదంటూ ఎవరూ ఆందోళన పడొద్దని.. టెన్షన్ పడొద్దని సూచించారు. అర్హత ఉండి.. ఎవరికైనా ఏ కారణంగా అయినా గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ రాకపోతే.. అలాంటి వారు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ అధికారులకు సంప్రదించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ రెండు పథకాలకు అర్హత ఉండి వాళ్లకు అమలు కాకపోతే.. మండల కేంద్రంలో తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చిన నమోదు చేసుకోవాలని.. వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేసి.. పథకం అమలు చేస్తామన్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

రేషన్ కార్డు అర్హత అనేది ముఖ్యమన్నారు. రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారాయన. ప్రభుత్వ పథకాల అమలులో పేదలకు న్యాయం చేయటం ముఖ్యం అన్నారు. రైతు బంధు కింద 22 వేల కోట్ల రూపాయలను ధనవంతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉండే వాళ్లకు ఇవ్వలేం కదా అంటూ విలేకరులను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. రేషన్ కార్డు ద్వారా పేదలను గుర్తించి.. అర్హులకే పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు లేనివారికి ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించాం అని.. వాటిని పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయటం జరుగుతుందన్నారు.

ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని.. అర్హులైన అందరికీ నిరంతరం అందించటం జరుగుతుందన్నారు. ఇప్పుడు రాకపోయినా.. దరఖాస్తు చేసుకున్న వెంటనే అమలు చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.