
హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్ , ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. డ్రగ్స్, గంజాయి గురించి టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇస్తే.. కట్టడి చేస్తామని అన్నారు. స్కూల్స్, కాలేజీల్లో మాదక ద్రవ్యాలు ఉంటే అది టీచర్లదే బాధ్యత అని.. పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని అన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలపై కూడా కేసులు పెట్టండని ఆదేశిస్తున్నానని అన్నారు సీఎం రేవంత్.
ఫీజులు తీసుకుంటాం.. బాధ్యత తీసుకోం అంటే కుదరదని.. బిహేవియరల్ ఛేంజెస్ గురించి చెప్పే సైకాలజీ ప్రొఫెషనల్స్ ను నియమించుకోవాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు సీఎం రేవంత్. పిల్లల వ్యవహార శైలిలో మార్పును గమనించాల్సిన బాద్యత టీచర్లది, యాజమాన్యాలదేనని అన్నారు. స్కూల్స్, కాలేజీల్లో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్.
ALSO READ | యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పేరు ఇకనుంచి ‘ఈగల్’: సీఎం రేవంత్
స్కూల్స్, కాలేజీల ముందు గంజాయి చాక్లెట్స్ అమ్మినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ టార్గెట్ న్యూయార్క్ అని.. బెంగళూర్, ముంబై, ఢిల్లీ కాదని అన్నారు. తెలంగాణలో 68 శాతం జనాభా యువత అని.. యువతకు స్కిల్స్ పెంపొందించేందుకు శిక్షణ ఇస్తే న్యూయార్క్ తో పోటీ పడగలమని అన్నారు సీఎం రేవంత్.
మాదక ద్రవ్య రహిత సురక్షితమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువతను ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడమే లక్ష్యంగా కలిసి పని చేద్దామని “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” సందర్భంగా కోరారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్.