- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటి చెప్పాలి
- జాతర పనులపై సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాస రాజు సమీక్ష
ములుగు, తాడ్వాయి, వెలుగు : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జాతరను నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటి చెప్పాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్.శ్రీనివాస రాజు పేర్కొన్నారు. గద్దెలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.
మేడారం వెళ్లే రోడ్లు, పార్కింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. భక్తులకు సులభంగా సమాచారం అందుబాటులో ఉండేందుకు మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని, అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఆలయ ఈఓ వీరస్వామి, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు , డీపీవో, ఎండోమెంట్, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
