యూత్‌ అందరికీ వ్యాక్సిన్ వెయ్యాలె

యూత్‌ అందరికీ వ్యాక్సిన్ వెయ్యాలె
  • పెరుగుతున్న డిమాండ్
  • టీకాకు ఏజ్ గ్రూప్ తగ్గించాలని ప్రధానిని కోరిన మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ సీఎంలు 
  • 18 ఏండ్లు నిండినోళ్లందరికీ ఇవ్వాలని మోడీకి ఐఎంఏ లెటర్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తో కేసులు పెరుగుతున్నాయి. పిల్లలు, యూత్ ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో యూత్ కు వ్యాక్సిన్ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం 45 ఏండ్లు నిండినోళ్లకే టీకా ఇవ్వడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే వ్యాక్సిన్ ఏజ్ ఎలిజిబిలిటీని తగ్గించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. 25 ఏండ్లు నిండినోళ్లందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఉద్ధవ్ సోమవారం లెటర్ రాశారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతించాలని అమరీందర్ సింగ్ ఇటీవల మీటింగ్ లో ప్రధానిని కోరారు. అన్ని వయసుల వారికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలని కేజ్రీవాల్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా ప్రధానికి లెటర్ రాసింది. 
వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలె: ఐఎంఏ 
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సూచించింది. 18 ఏండ్లు నిండినోళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధానికి మంగళవారం లెటర్ రాసింది. ‘‘ప్రస్తుతం 45 ఏండ్లు నిండినోళ్లకు వ్యాక్సిన్ వేస్తున్నారు. కానీ సెకండ్ వేవ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వెంటనే స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది” అని అందులో పేర్కొంది. 18 ఏండ్లు నిండినోళ్లందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసేందుకు సర్కార్ కు తమవంతు సహకారం అందిస్తామని 
తెలిపింది. 

 

  • ఐఎంఏ సూచనలివీ.. 

    ప్రైవేట్ హాస్పిటళ్లతో పాటు ప్రైవేట్ క్లినిక్ లలోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలి. 
    పబ్లిక్ ప్లేస్ లలోకి వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలి. 
    మాస్ వ్యాక్సినేషన్ కోసం జిల్లాల్లో వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఏర్పాటు చేయాలి. అందులో తాము పాలుపంచుకుంటామని ఐఎంఏ తెలిపింది. 
    సెకండ్ వేవ్ వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఆ చైన్ ను బ్రేక్ చేసేందుకు లిమిటెడ్ పీరియడ్ లాక్ డౌన్లు పెట్టాలి. అత్యవసర సేవల కిందికి రాని వాటిపై బ్యాన్ విధించాలి. ముఖ్యంగా సినిమా హాళ్లు, కల్చరల్, రిలీజియస్, స్పోర్ట్స్ ఈవెంట్లు తదితరాలపై నిషేధం విధించాలి.