- పేపర్, సిమెంట్ కంపెనీల గోడు
- సప్లయ్ మొదలైనా డిమాండుకు దూరంగా..
- థర్మల్ ప్లాంట్లకు సప్లయ్ పెంచిన కోల్ ఇండియా
- ఐఈఎక్స్ లో తగ్గిన స్పాట్ కరెంట్ ధరలు
బిజినెస్ డెస్క్, వెలుగు: కోల్ సప్లయ్ తిరిగి ప్రారంభమవుతున్నా, అల్యూమినియం, పేపర్, సిమెంట్ వంటి నాన్–పవర్ సెక్టార్లకు తగినంత బొగ్గు దొరకడం లేదు.బొగ్గు సప్లయ్ విషయంలో పవర్ సెక్టార్కు కోల్ ఇండియా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. నాన్- పవర్ సెక్టార్లకు బొగ్గు సప్లయ్ను ఆపేసిన విషయం తెలిసిందే. తాజాగాఈ సెక్టార్ కంపెనీలకు కూడా బొగ్గు సప్లయ్ను ప్రారంభించింది. కానీ, డిమాండ్ తగ్గ బొగ్గు అందడం లేదని నాన్ పవర్ సెక్టార్ కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. ప్లాంట్లు నడవాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని, కోల్ సప్లయ్ను పెంచాలని కోరుతున్నాయి. పవర్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు మెరుగుపడితే, నాన్–పవర్ సెక్టార్ కంపెనీలకు బొగ్గు సప్లయ్ను పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే కోల్ ఇండియాకు ఆదేశాలు ఇచ్చింది. ఇంకో 10–12 రోజుల్లో బొగ్గు సప్లయ్పై రిస్ట్రిక్షన్లు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టైమ్లో థర్మల్ ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు ఆరు–ఏడు రోజులకు చేరుకుంటాయని, ఇది కంఫర్టబుల్ లెవెల్ అని చెబుతున్నారు. కానీ, ప్రసుతానికి మాత్రం నాన్–పవర్ సెక్టార్ బొగ్గు కొరతతో ఇబ్బంది పడుతోంది. ఈ సెక్టార్కు బొగ్గు సప్లయ్ను ఆపేసి, పవర్ కంపెనీలకు కోల్ ఇండియా సప్లయ్ను పెంచింది. ‘తమ దగ్గర బొగ్గు నిల్వలు అయిపోతున్నాయి. ప్లాంట్లను నడపడానికి మరో మార్గం ఏదీ కనిపించడం లేదు. వెంటనే కోల్ సప్లయ్ తిరిగి ప్రారంభం కాకపోతే భారీ నష్టం ఏర్పడుతుంది’ అని ఒక అల్యూమినియం కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రభుత్వం మాత్రం నాన్ పవర్ సెక్టార్కు గత ఐదు రోజుల నుంచి సగటున 2,60,000 టన్నుల బొగ్గును సప్లయ్ చేస్తున్నామని, సాధారణ పరిస్థితుల్లో ఇది 3,00,000 టన్నులుగా ఉండేదని చెబుతోంది. ప్రస్తుతం నాన్–పవర్ సెక్టార్ దగ్గర 9.4 గిగా వాట్ల కెపాసిటీ ఉన్న పవర్ ప్లాంట్లు ఉన్నాయి. సడెన్గా బొగ్గు సప్లయ్ ఆగిపోవడంతో బొగ్గును ఇంపోర్ట్ చేసుకోవడం ఈ సెక్టార్కు కష్టమవుతోంది. ఈ సెక్టార్కు పెద్ద మొత్తంలో పవర్ అవసరం ఉంటుంది. దీంతో ఎక్స్చేంజిల్లో సరిపడినంత ఎలక్ట్రిసిటీ దొరకడం లేదు.
పవర్ సెక్టార్కు తాత్కాలికంగా రిలీఫ్..
మరోవైపు పవర్ సెక్టార్కు బొగ్గు క్రైసిస్ నుంచి తాత్కాలికంగా రిలీఫ్ దొరుకుతోంది. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సప్లయ్ను కోల్ ఇండియా పెంచుతోంది. దీంతో ఈ ప్లాంట్ల దగ్గర సగటును నాలుగు రోజుల సప్లయ్ ఉన్నట్టు ప్రభుత్వం డేటా ద్వారా తెలుస్తోంది. బొగ్గు సప్లయ్ నిలకడగా కొనసాగుతుండడంతో చాలా ప్లాంట్లలో తిరిగి వర్క్ ప్రారంభమయ్యింది. అంతేకాకుండా వాతవారణం చల్లగా మారడంతో నార్త్ ఇండియాలో కరెంట్ వాడకం బాగా తగ్గింది. ఈ వారం పండగ వలన సెలవులు రావడంతో ఫ్యాక్టరీలలో కూడా వర్క్ కొద్దిగా తగ్గింది. దీంతో పవర్ డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తగ్గుతోంది. థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోతుండడంతో వారం క్రితం పవర్ క్రైసిస్ గురించి అందరూ భయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది.
స్పాట్ కరెంట్ దిగొస్తోంది..
ప్రస్తుతానికి దేశంలోని థర్మల్ ప్లాంట్ల వద్ద సగటున నాలుగు రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇంకా పరిస్థితులు మెరుగవ్వలేదని నిపుణులు చెబుతున్నారు. కానీ, అధ్వాన్న పరిస్థితుల నుంచైతే కొంత బయటపడ్డామని పేర్కొన్నారు. ఈ నెల 13 నాటికి 137 గిగావాట్ల కెపాసిటీ ఉన్న ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నాయి. కానీ, అంతకు ముందు రోజు 142 గిగా వాట్ల కెపాసిటీ ఉన్న ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తక్కువగా ఉండేవి. దీన్ని బట్టి చాలా ప్లాంట్లకు తగినంత బొగ్గు సప్లయ్ అవుతోందని తెలుస్తోంది. దసరా పూర్తవ్వడంతో కోల్ సప్లయ్ మరింత పెరుగుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజి (ఐఈఎక్స్) లో స్పాట్ కరెంట్ ధరలు తగ్గుతున్నాయి.ఈ ఎక్స్చేంజిలో శుక్రవారం యూనిట్ కరెంట్ ధర సగటున రూ. 9.67 గా ఉంది. కిందటి వారం ఈ రేటు యూనిట్కు రూ. 14 గా ఉండేది. అదానీ పవర్ వంటి కొన్ని కంపెనీలు యూనిట్ను రూ. 18 కి కూడా అమ్మాయి.
బొగ్గు క్రైసిస్తో ఈ కంపెనీలకు పండగే!
బొగ్గు కొరత రావడంతో కొన్ని కంపెనీలు భారీగా సంపాదించుకోగలిగాయి. పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలు యూనిట్ కరెంట్ను రూ. 16-18 దగ్గర సేల్ చేశాయి. సాధారణ టైమ్లో యూనిట్ కరెంట్ ధర రూ. 4-6 మధ్యే ఉంటుంది. హిందుస్తాన్ పవర్, అదానీ పవర్ స్టేజ్ 2, టీస్టా స్టేజ్-3 వంటి కంపెనీలు యూనిట్పై రూ. 18 వరకు వసూలు చేశాయి. టాటా పవర్, అదానీ పవర్, ఎస్సార్ ఎనర్జీ వంటి పవర్ కంపెనీలతో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ సప్లయ్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.