కొకైన్, ఎండీఎంఏ, గాంజా పట్టివేత

కొకైన్, ఎండీఎంఏ, గాంజా  పట్టివేత
  • ‘న్యూఇయర్’ కోసం తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ ​వెళ్తూ డిచ్​పల్లిలో దొరికిన నిందితులు

నిజామాబాద్, వెలుగు : న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​కోసం కొకైన్​, ఎండీఎంఏ తీసుకెళ్తున్న ఇద్దరిని సోమవారం నిజామాబాద్​ శివారులోని డిచ్​పల్లి హైవేపై పోలీసులు పట్టుకున్నారు. వీరి కారులో 12.3 గ్రాముల కొకైన్​తో పాటు 3.2 గ్రాముల ఎండీఎంఏ, 3.1 గ్రాముల గాంజా పౌడర్​ దొరికింది. వివరాలను సోమవారం ఇన్​చార్జి సీపీ జయరాం వెల్లడించారు. ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు జొన్నాడ గ్రామానికి చెందిన ద్వారంపూడి విక్రమ్​రెడ్డి, పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన షేక్​ ఖాజా మొయినుద్దీన్​ కొన్నాళ్ల నుంచి హోటల్​ బిజినెస్ ​చేస్తూ హైదరాబాద్​లో ఉంటున్నారు.

డ్రగ్స్​కు అలవాటుపడిన వీరు మరికొందరు ఫ్రెండ్స్​తో కలిసి న్యూ ఇయర్​ సెలబ్రేట్​ చేయడానికి కొకైన్, ఎండీఎంఏ, గాంజాను ఢిల్లీలో రాహుల్, మైక్ ​నుంచి కొన్నారు. అక్కడి నుంచి మహారాష్ట్ర, నాగ్​పూర్ ​మీదుగా హైదరాబాద్​కు కారులో వస్తున్నారు. నడిపల్లి తండా హైవే వద్ద  డిచ్​పల్లి సీఐ కృష్ణ, ఎస్ఐ మహేశ్​ వీరి కారు తనిఖీ చేయగా కొకైన్​తో పాటు ఎండీఎంఏ, గాంజా పౌడర్​ దొరికింది. ఇవి కాకుండా మరో మూడు కవర్లు దొరికాయని, అందులో ఉన్న పౌడర్​ ఏమిటో తేల్చే పనిలో పడ్డామని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్​ చేశామని ఇన్​చార్జి సీపీ జయరాం తెలిపారు. ఏసీపీ కిరణ్​కుమార్, టాస్క్​ఫోర్స్​ ఏసీపీ రాజశేఖర్​రాజు, ఇన్​స్పెక్టర్ అజయ్​బాబు ఉన్నారు.