
- పెబ్బేరు హైస్కూల్ నిర్వహణపై కలెక్టర్ సీరియస్
పెబ్బేరు, వెలుగు: గత ఏడాది కంటే ఈ ఏడాది హైస్కూల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గడంపై కలెక్టర్ ఆదర్శ్ సురభి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం పెబ్బేరు జడ్పీ హైస్కూల్ను తనిఖీ చేశారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెబ్బేరు పట్టణంలోని బీసీ బాయ్స్ హాస్టల్లో సౌలతులు సరిగా లేక ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు రావడం లేదని టీచర్స్ చెప్పడంతో, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. విద్యార్థుల సంఖ్య పెంచుతారా? అని ప్రశ్నించారు. స్కూల్ నిర్వహణ సరిగా లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్కూల్కు హెచ్ఎం విష్ణువర్ధన్ రాకపోవడంతో ఆయనకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. టెన్త్ విద్యార్థుల మ్యాథ్స్ సామర్థ్యాన్ని పరిశీలించి, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారిని అభినందించి నోట్బుక్స్ బహుమతిగా ఇచ్చారు.
అనంతరం బీసీ బాయ్స్ హాస్టల్ను సందర్శించారు. అక్కడ టాయిలెట్స్, మరుగుదొడ్లు, నల్లాలు సరిగా లేకపోవడంతో, వాటిని బాగు చేయించేందుకు ఎస్టిమేషన్లు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖాజీ ఆరీఫుద్దీన్ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ అమృత్సాగర్ అందుబాటులో లేకపోవడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఈవో అబ్దుల్ గని, తహసీల్దార్ మురళీ గౌడ్, ఎంఈవో జయరాములు, ఇన్చార్జి ఎంపీడీవో రోజారెడ్డి, ఆర్ఐ రాఘవేందర్ పాల్గొన్నారు.