కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: జిల్లాలో వానాకాలం సీజన్​కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్​సురభి హెచ్చరించారు. బుధవారం వనపర్తిలోని కిసాన్ మిత్ర ఫెర్టిలైజర్ షాప్​ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా, డీఏపీ నిల్వలను ఆన్​లైన్ లో ఉన్న వివరాలతో పోల్చి చూశారు. అనంతరం ఒకేషనల్ కాలేజీని సందర్శించారు. కళాశాల బిల్డింగ్ రిపేర్​కు రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. 

గవర్నమెంట్ హాస్పిటల్​కు వెళ్లి,  సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ఆస్పత్రిలో సీసీరోడ్డు, మురుగు కాల్వ రిపేర్​కు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులతో వచ్చే వారికి తప్పనిసరిగా రక్త పరీక్షలు చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మల్లికార్జున్, డీఎంహెచ్​వో శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్లు సాయినాథ్ రెడ్డి, రామచంద్రారావు, పరిమళ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. 

అందుబాటులో ఎరువులు..

కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని  కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం బిజినపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్​ ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేశారు. అన్ని ఎరువుల దుకాణాల ఎదుట నిల్వ, ధరల సూచిక బోర్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. 

అనంతరం స్థానిక రైతులతో మాట్లాడి, ఎరువులు సరిపడా అందుతున్నాయా అని అడగగా వారు అందుతున్నాయని తెలిపారు. డీఏవో యశ్వంత్ రావు, ఏవోలు ఉన్నారు.  అనంతరం బిజినపల్లి పీహెచ్​సీని కలెక్టర్ తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్​రిజిస్టర్​ను పరిశీలించారు. సీజనల్​వ్యాధులకు సంబంధించిన అన్ని మందులు నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని డెలివరీ కేసులు నమోదయ్యాయి, ఎన్ని సాధారణ ప్రసవాలు జరిగాయని తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్​డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు.