
గోపాల్పేట, వెలుగు: భూభారతి పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న గోపాలపేట మండలంలో వచ్చిన దరఖాస్తులను జూన్ 2 లోగా పరిష్కరించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం గోపాల్పేట తహసీల్ ఆఫీసులో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. మొత్తం 573 దరఖాస్తులు రాగా 246 దరఖాస్తులకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ పాండు తెలిపారు. ఇందులో 155 సక్సెషన్ దరఖాస్తులు ఉండగా మిగిలినవి సాదాబైనామాకు సంబంధించినవని చెప్పారు.
స్పందించిన కలెక్టర్.. తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించి మిగిలిన వాటిని కలెక్టర్ లాగిన్ కు పంపించాలని ఆదేశించారు. జూన్ 2 వరకు భూభారతి దరఖాస్తులన్నీ పరిష్కరించి జూన్ 2న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసేలా చూడాలని సూచించారు. అనంతరం మండలంలోని ఏదుట్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వర్షాలు పడుతున్నందున కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యాన్ని త్వరగా తరలించడం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడి జాప్యం లేకుండా చూడాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ వెంట డీఎస్వో కాశీ విశ్వనాథ్ ఉన్నారు.