
సిద్దిపేట రూరల్, వెలుగు: యూరియా కోసం ఆందోళన చెందవద్దని, రైతులందరికీ సరిపోయేంత యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ హైమావతి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వానాకాలానికి సంబంధించి మన జిల్లాకు 31,931 టన్నుల యూరియా అవసరం ఉండగా ప్రభుత్వం 26,500 టన్నుల యూరియాను కేటాయించిందన్నారు. ఆ యూరియాను ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులకు సరఫరా చేశామన్నారు.
ఆగస్టు 31 వరకు మరో 5500 టన్నుల యూరియాను ప్రభుత్వం అలాట్ చేస్తుందన్నారు. ప్రైవేట్ డీలర్స్ ద్వారా మరో వెయ్యి టన్నుల యూరియా ఇస్తుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ యూరియా సరఫరాపై పర్యవేక్షిస్తూ కావలసినంత యూరియా జిల్లాకు వచ్చేలా కృషి చేస్తున్నారన్నారు.
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
కోహెడ: కోహెడ మండల కేంద్రంలోని పీహెచ్ సీని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్, ఇన్ పేషంట్, ఆరోగ్య మహిళ, వ్యాక్సినేషన్ రిజిస్టర్లను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ లో ఎలాంటి లీవ్ శాంక్షన్ లేకుండా గైర్హాజరైన సిబ్బంది విజయ, సతీశ్కుమార్, మెడికల్ లీవ్ లో ఉన్న ఆయుష్ డాక్టర్ కిరణ్ కుమారి, డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసినా రిటర్న్వెళ్లకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న స్టాప్ నర్స్ పూజపై చర్య తీసుకోవాలని డీఎంహెచ్వోకు సూచించారు. ఔట్పేషెంట్ రిజిస్టర్ ను కచ్చితంగా మెయింటైన్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహమ్మద్ సమీర్ ఖాన్, ఎంపీడీవో కృష్ణయ్య ఉన్నారు.
చేర్యాల, మద్దూరు మండలాల్లో కలెక్టర్ ఆకస్మికపర్యటన
చేర్యాల: చేర్యాల, మద్దూరు మండలాల్లో కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. చేర్యాల నుంచి కడవేర్గు గ్రామ పరిధిలో ఉండే లో- లెవెల్ వంతెన, మద్దూరు మండలంలోని గాగిలాపూర్ గ్రామ పరిధిలోని లో- లెవెల్ వంతెనలను పరిశీలించారు. లో-లెవెల్ వంతెనపై నుంచి నీరు వెళ్తే రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ పికెటింగ్ సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఆర్అండ్ బీ ఏఈ ఉన్నారు.