
జైపూర్(భీమారం), వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో సకల సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారంలోని, జెడ్పీ హైస్కూల్ను, కాజీపల్లిలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజనం నాణ్యత, స్కూల్ పరిసరాలను పరిశీలించారు.
విద్యారంగా అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అన్ని ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. జడ్పీ హైస్కూల్లో ఆరో తరగతి స్టూడెంట్లకు పాఠాలు బోధించారు. దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రైమరీ హెల్త్సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించి పనులు స్పీడప్ చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.గిరిజన ఆశ్రమ హైస్కూల్, కేజీబీవీని సందర్శించారు. ఎంపీవో సతీశ్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.