కరీంనగర్ టౌన్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, చనిపోయిన జంతువులు, రోడ్లు, తదితర ఆస్తుల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి 369 అర్జీలను స్వీకరించారు.
అనంతరం అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేయాలన్నారు. జిల్లాలోని పీహెచ్సీల పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు.
అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి మత్స్యశాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్విని తానాజి వాకడే, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
