- కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: పెయింటింగ్ సౌందర్యానికి, సృజనాత్మకతకు ప్రతీక అని కలెక్టర్ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు నాలుగు రోజులపాటు తంజావూరు పెయింటింగ్ లో శిక్షణ ఇచ్చారు. శుక్రవారం కలెక్టర్ ప్రావీణ్య కాలేజీని సందర్శించి పెయింటింగ్స్ను తిలకించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఇలాంటి కళా నైపుణ్య శిక్షణా కోర్సులు విద్యార్థుల్లో మానసిక స్థిరత్వం, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. భవిష్యత్లో ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని తెలిపారు. అరుదైన కళారూపాలను కాపాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కోర్సును నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా సోలాపూర్కు చెందిన స్వచ్ఛంద సంస్థ జ్ఞాన ప్రబోధిని, మల్లికార్జున హైస్కూల్, రాకంబాయి హత్తురే జూనియర్ కాలేజీ, సోలాపూర్ వారి సంయుక్త సహకారంతో 25 గంటల తంజావూరు పెయింటింగ్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహించామని ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్స్ నిర్మల, జగదీశ్వర్, అర్థశాస్త్ర విభాగ అధ్యాపకుడు జ్ఞాన ప్రబోధిని, సంస్థకు చెందిన మురళి, రిసోర్స్ పర్సన్ మల్లికార్జున బిరాజ్దార్, విద్యార్థులు పాల్గొన్నారు.
