సైన్స్ ల్యాబ్తో సృజనాత్మకతకు ప్రోత్సాహం : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

సైన్స్ ల్యాబ్తో సృజనాత్మకతకు ప్రోత్సాహం : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: సైన్స్​ల్యాబ్​లు విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని, వారి సొంత ఆలోచనలను రూపొందించుకోవడంలో సహాయపడుతాయని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. అమెరికా ఇండియా ఫౌండేషన్, అట్లాసియాన్​ ఎన్జీవోలు ముందుకు వచ్చి రూ.15 లక్షలతో పెంబర్తి జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ లను బుధవారం కలెక్టర్​ ఎన్జీవో ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధి రమేశ్, అట్లాస్​ ప్రతినిధులు, హెచ్​ఎం నాగరాణి, ఏఎంవో శ్రీనివాస్, ఎంఈవో శంకర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 అనంతరం పెంబర్తిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటే ప్రభుత్వం నగదును అకౌంట్ లోకి జమ చేస్తుందన్నారు. అంతకుముందు జనగామ పట్టణంలోని 18, 7 నెంబర్​ గల రేషన్​షాపులను ఆయన సందర్శించారు. బియ్యం సరఫరా, క్వాలిటీపై ఆరా తీశారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్​ సీసీఎల్ఏ ఆఫీస్​ నుంచి రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి లోకేశ్​కుమార్​ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​ పాల్గొన్నారు. 

ప్రోగ్రామ్​లో ఈ నెల 5వ తేదీన జీపీవోలకు నియామక పత్రాలు జారీ చేయనున్నట్లు, ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలను అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోకేశ్​కుమార్​ సూచించారు. ​జిల్లాకు సంబంధించి 117 మంది గ్రామ పరిపాలనాధికారులుగా నియామక పత్రాలు తీసుకోనున్నారని, ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.