గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

ఆసిఫాబాద్, వెలుగు : బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న గురుకుల పాఠశాల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు కోరారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో సాంఘిక సంక్షేమ గురుకులాల అధికారులతో సమావేశమై ప్రవేశ పరీక్షకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్​లైన్ ద్వారా ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న బాలబాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. 

ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వివరాలకు హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 45678 లో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల ఆర్ సీఓ స్వరూప రాణి, డీసీఓ బాలరాజు, ప్రిన్సిపాళ్లు సంధ్యారాణి, జ్యోతి, శ్రీనాథ్, సంగీత  పాల్గొన్నారు.