ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెంచికల్ పేట మండలం చెడ్పాయికి చెందిన బోయిరే బావాజీ గత నెలల క్రితం తన కుమారుడికి, మనుమడికి భూమి ఇచ్చానని, ఇప్పుడు తన పోషణ పట్టించుకోవడం లేదని, వారి నుంచి భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. 

పింఛన్, రైతు భరోసా ఇప్పించాలని, ఉపాధి కల్పించాలని, పట్టా పాసు పుస్తకాలు జారీ చేయాలని, పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, దరఖాస్తులు అందాయి. అర్జీలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వన మహోత్సవంలో ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తిచేయాలని ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

నిర్మల్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని నిర్మల్ అడిషనల్​కలెక్టర్ కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. వానాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులు చేపట్టాలన్నారు. వనమహోత్సవంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని, అందుకు ఏర్పాట్లను పూర్తిచేయాలని సూచించారు.

ఆదిలాబాద్​లో 115 అర్జీలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​కు 115 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్లకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ సొనాలి చబ్రా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

మంచిర్యాలలో 49 దరఖాస్తులు

నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్​లో మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, షరతులు లేకుండా రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని, జైపూర్ మండలం కిష్టాపూర్​లో అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ, దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు. మొత్తం 49 దరఖాస్తులు అందాలని, ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్​ తెలిపారు.