ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇచ్చోడ, వెలుగు: అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు మండల పంచాయతీ, ఉపాధిహామీ సిబ్బంది కూడా పోడు భూముల సర్వేలో భాగస్వాములు కావాలని ఎంపీడీవో రాంప్రసాద్​ఆదేశించారు. బుధవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎంపీడీవో మీటింగ్​హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పనితీరుపై సమీక్ష జరిపారు. ఎంపీవో రమేశ్, ఏపీవో నరేందర్​గౌడ్​ పాల్గొన్నారు.

బీజేపీలోకి ఎవ్వరూ వచ్చిన ఆహ్వానిస్తాం

    ఎంపీ సోయం బాపురావు

భైంసా, వెలుగు: ముథోల్​ సెగ్మెంట్​లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎంపీ సోయం బాపురావు సూచించారు. బుధవారం భైంసాలో ఎస్ఎస్​ కాటన్, దారాబ్జీ ఫ్యాక్టరీలో మీటింగ్​ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్​ పార్టీని వీడిన రామారావు పటేల్​ను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అంతకుముందు రామారావు పటేల్​తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సూచన మేరకు బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీజేపీలోకి వచ్చేందుకు రామారావు పటేల్​ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​తో కలిసి కార్యకర్తలతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్​ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ముథోల్​ సెగ్మెంట్​లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలోకి ఎవ్వరూ వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీలో సాధారణ కార్యకర్తకు కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అనంతరం ఎంపీని రామారావు పటేల్, మోహన్​రావు పటేల్​వేర్వేరుగా సన్మానించారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

ఆదిలాబాద్/నిర్మల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో ఏ టైంలోనైనా ఎన్నికలు రావొచ్చని, బీజేపీ కార్యకర్తలు అందుకు రెడీగా ఉండాలని ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు. గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌లో బుధవారం నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ నాయకుడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరానికి ఉద్యమించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి అల్జాపూర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్, మాజీ ఎంపీ రాథోడ్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌, నాయకులు సుహాసినిరెడ్డి, దశరథ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం బీజేపీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి అయ్యన్నగారి భూమయ్యను పరామర్శించారు.

ఆదివాసీలను అడవులకు దూరం చేయాలని కుట్ర

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  విజయ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు: అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టాలనే కుట్రతోనే కేసీఆర్ ప్రభుత్వం పులులను అడవుల్లోకి వదులుతోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక్ విజయ్ కుమార్ ఆరోపించారు.  మంగళవారం పులి దాడిలో చనిపోయిన గిరిజన రైతు సిడాం భీము కుటుంబాన్ని బుధవారం బీజేపీ లీడర్లు ​పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.  ఈ సందర్భంగా విజయ్​కుమార్​మాట్లాడుతూ భీము కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్​ఆఫీసర్లు వెంటనే పులులను బంధించి తరలించకుంటే  ఆదివాసులతో కలిసి దాడులు చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్​పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ వాంకిడి మండల అధ్యక్షుడు  శ్రవణ్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఇల్లు కాలిపోయిన బాధితులకు బీజేపీ లీడర్ల ఆర్థిక సాయం

రెబ్బెన మండలం గంగాపూర్ కు చెందిన  వడై శంకర్ ఇల్లు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో.. బుధవారం బాధిత కుటుంబానికి  ఆదిలాబాద్​పార్లమెంట్ కో కన్వీనర్ కిరణ్ కుమార్, బీజేపీ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్​చార్జి అజ్మీర ఆత్మరాం నాయక్ ఆర్థికసాయం, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​చేశారు.  బీజేపీ జిల్లా కార్యదర్శి  బాలకృష్ణ , జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ ​ఆఫీస్ ​పనులు వేగంగా పూర్తి చేయాలి

    డీజీపీ మహేందర్​రెడ్డి

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ ఆఫీస్​ పనులు  వేగంగా పూర్తి చేయాలని డీజీపీ కె. మహేందర్​రెడ్డి ఇంజినీరింగ్​ఆఫీసర్లను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన స్టేట్​హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్  కోలేటి దామోదర్ తో కలిసి కొత్త పోలీస్​ఆఫీస్​ను విజిట్ ​చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని డీపీవో ఆఫీస్​లు ఒకే విధంగా ఉండాలని రూ.38.5 కోట్ల వ్యయంతో డీపీవో ఆఫీస్​, ఎస్పీ క్వార్టర్స్​సెంట్రీ గార్డ్​నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఎస్పీ కె. సురేశ్​కుమార్, అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు,
డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్  పాల్గొన్నారు.

ఆసిఫాబాద్​ పోలీసుల పనితీరు భేష్

కమ్యూనిటీ పోలీసింగ్ లో  ఆసిఫాబాద్ జిల్లా పోలీసు అధికారుల పనితీరు బాగుందని రాష్ట్ర డీజీపీ  మహేందర్ రెడ్డి అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఏ ఆర్  హెడ్ క్వార్టర్స్ లో  బుధవారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో రివ్యూ చేశారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,    జిల్లా పోలీసులు  ప్రజలకు  అందుబాటులో ఉంటూ వారితో  మమేకమై  సేవలందిస్తున్నారని, ఇది  శుభపరిణామని అన్నారు.  జిల్లాలో ఉచిత కంటి ఆపరేషన్లు,  మెగా మెడికల్ క్యాంపుల్లాంటి  కార్యక్రమాలను నిర్వహించడం పట్ల  అభినందించారు. మావోయిస్టులను ఎదుర్కోవడంలో జిల్లా పోలీసు  వ్యవస్థ సక్సెసయ్యిందన్నారు.  ఆదివాసీల సంప్రదాయాలను గౌరవిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని,    ఎన్నో సామాజిక  కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే.సురేశ్​ కుమార్ ,అడిషనల్​  ఎస్పీ (అడ్మిన్)  అచ్చేశ్వర్​రావు, డిఎస్పీ లు శ్రీనివాస్, కరుణాకర్ పాల్గొన్నారు.

సింగరేణిపై బహిరంగ చర్చకు సిద్ధమా? 

ఎమ్మెల్యే బాల్క సుమన్​కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు సవాల్​ 

మంచిర్యాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తుందని టీఆర్​ఎస్​ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ బహిరంగ చర్చకు రావాలని సవాల్​ విసిరారు. బుధవారం ఆయన పార్టీ జిల్లా ఆఫీసులో ప్రెస్​మీట్​ నిర్వహించారు. సింగరేణిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 49:51 శాతం వాటా కలిగి ఉన్నాయని, తక్కువ వాటా ఉన్న కేంద్రం ప్రైవేటుపరం ఎట్ల చేస్తుందని ప్రశ్నించారు. 2015లో పార్లమెంట్​లో కోల్​ బ్లాక్​ల వేలం బిల్లుకు నాటి ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్​ అనుకూలంగా ఓటువేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు.

ఓపెన్ కాస్ట్​ను రాష్ట్ర ప్రభుత్వమే ఆంధ్ర కంపెనీకి అంటగట్టిందని విమర్శించారు. ఒడిశాలోని రెండు బ్లాక్​లను వేలంలో దక్కించుకున్న సింగరేణి సంస్థ రాష్ర్టంలోని బ్లాక్​లకు నిర్వహించిన వేలంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కవిత లిక్కర్​ స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందన్నారు. సీఎం కేసీఆర్​ సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. బీజేవైఎం రాష్ర్ట అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు, నస్పూర్​, బెల్లంపల్లి టౌన్​ ప్రెసిడెంట్లు​ అగల్​డ్యూటీ రాజు, కోడి రమేశ్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, తోట మల్లికార్జున్, మల్లేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

పర్మిషన్​ లేని వెంచర్ల కూల్చివేత

భైంసా, వెలుగు :  పట్టణంలో  అనుమతులు లేని వెంచర్లను  రెవెన్యూ ఆఫీసర్లు  బుధవారం కూల్చేశారు.  కలెక్టర్​ ముషారఫ్​ ఆలీ ఫారూఖి ఆదేశాల మేరకు  ఆర్డీఓ  లోకేశ్వర్​రావు, తహసీల్దార్​ చంద్రశేఖర్​ రెడ్డి  ఆధ్వర్యంలో ఆఫీసర్ల బృందం అక్రమ కట్టాలను కూల్చివేసింది. గడ్డెన్న ప్రాజెక్టు సమీపంలో ఉన్న వెంచర్​ హద్దులను తొలగించి, సుద్దవాగు పరివాహాక ప్రాంతంలో అక్రమ కట్టడాన్ని జేసీబీతో కూల్చివేశారు. వెంచర్లకు డీటీసీపీ, నాలా పర్మిషన్​ లేకపోవడంతో తొలగిస్తున్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. భైంసాలో మొత్తం 21 వెంచర్లకు అనుమతులు లేవని, ఇప్పటి వరకు 4 వెంచర్ల హద్దులు తొలగించినట్లు తెలిపారు. దశల వారీగా మిగతా వెంచర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి

నిర్మల్, వెలుగు : పోడు భూముల అర్హులను గుర్తించేందుకు జరుగుతున్న సర్వే, గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. పోడు భూముల సర్వే, గ్రామ సభల నిర్వహణపై బుధవారం స్థానిక అంబేద్కర్‌‌‌‌ భవన్‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పోడు భూముల సర్వే త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అప్లికేషన్‌‌‌‌ చేసుకున్న వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ సర్వేను స్పీడప్‌‌‌‌ చేయాలని చెప్పారు. గ్రామసభకు హాజరైన వారి వివరాలు తీసుకోవాలని, చట్టప్రకారం సాగులో ఉన్న వారికి మాత్రమే ఆర్‌‌‌‌వోఎఫ్‌‌‌‌ పట్టాలు జారీ చేస్తామన్నారు. ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, విలేజ్‌‌‌‌ సెక్రటరీలు కో ఆర్డినేషన్‌‌‌‌తో పనిచేయాలని సూచించారు. సర్వే, గ్రామసభల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలన్నారు. మండల స్థాయి ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సర్వే వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ హేమంత్ బోర్కడే, ఐటీడీఏ పీవో వరుణ్‌‌‌‌రెడ్డి, జడ్పీ సీఈవో, ఎంపీడీవోలు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.