ఈ ఏడాది రూ.52 వేల కోట్లు

ఈ ఏడాది రూ.52 వేల కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.52 వేల కోట్లను సమీకరించాయి.  పెరుగుతున్న వడ్డీ రేట్లు,  భౌగోళిక రాజకీయ ఇబ్బందులు కారణంగా మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓల ద్వారా వచ్చే మూలధనం కొద్దిగా తగ్గినా, ఇష్యూల సంఖ్య మాత్రం పెరిగింది.  కొత్త సంవత్సరంలోనూ ఐపీఓ మార్కెట్‌‌‌‌ బుల్లిష్​గా ఉంటుందని చెబుతున్నారు. 2022లో ఎల్‌‌‌‌ఐసీ  బ్లాక్‌‌‌‌బస్టర్ తొలి పబ్లిక్ ఇష్యూ రూ. 20,557 కోట్లను మినహాయిస్తే, ఈ ఏడాది ఐపీఓ వసూళ్లు గత సంవత్సరం కంటే 36 శాతం పెరిగాయి. 

ముఖ్యంగా, మార్కెట్లలో మిడ్,  స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లకు ఈ సంవత్సరం భారీ డిమాండ్​ కనిపించింది.  లాభాలు బాగా రావడం, ప్రైసింగ్​ సరిగ్గా ఉండటం వల్ల ఐపీఓలపై బలమైన ఆసక్తి ఏర్పడిందని పాంటోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ లునావత్ అన్నారు. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్​ ప్రశాంత్ రావు మాట్లాడుతూ బలమైన, దేశీయ  విదేశీ పెట్టుబడుల వల్ల భారతీయ మార్కెట్లు దూసుకెళ్తాయని చెప్పారు.  

24 కంపెనీలకు గ్రీన్​సిగ్నల్​

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇప్పటికే క్లియరెన్స్‌‌‌‌ పొందిన దాదాపు 24 కంపెనీలు కొత్త సంవత్సరంలో రూ.26 వేల కోట్లకు పైగా సమీకరించాలని చూస్తున్నాయి.  ఇవి ఇంకా తమ ఐపీఓలను ప్రారంభించలేదు. మరో 32 కంపెనీలు సెబీకి తమ డ్రాఫ్ట్ పేపర్‌‌‌‌లను దాఖలు చేశాయి.  రూ. 35,000 కోట్లకు పైగా సమీకరించడానికి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. నెక్సస్​ సెలెక్ట్ ట్రస్ట్ రీట్​ రూ. 3,200-కోట్ల ఐపీఓతో సహా రూ. 52,637 కోట్లను సమీకరించడానికి ఈ సంవత్సరం 58 తొలి పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి.

గత ఏడాది రూ.59,302 కోట్లు సేకరించిన 40 కంపెనీల కంటే 2023లో నిధుల సమీకరణ తక్కువగా ఉంది.  రూ. 20,557 కోట్ల ఎల్‌‌‌‌ఐసీ ఇష్యూ కారణంగా ఈ మొత్తం ఎక్కువగా ఉంది. మొత్తం ఐపీఓ నిధుల్లో దీనివాటా 35 శాతం ఉంది. దీనికి ముందు, 63 కంపెనీలు 2021లో ప్రారంభ వాటా విక్రయాల ద్వారా రూ. 1.2 లక్షల కోట్లను సమీకరించాయి. ఇది రెండు దశాబ్దాలలో అత్యుత్తమ ఐపీఓ సంవత్సరం. ఈ నిధుల సేకరణకు అధిక లిక్విడిటీ, రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం కారణాలు. గత మూడు సంవత్సరాలలో 150 కంటే ఎక్కువ మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓలు లిస్టింగ్ కోసం వచ్చాయి. 

పెరుగుతున్న వడ్డీ రేట్లు,  భౌగోళిక రాజకీయ ప్రమాదాల కారణంగా  అస్థిరత ఉన్నప్పటికీ, 2023 భారతీయ ఐపీఓ మార్కెట్లకు చాలా మంచి సంవత్సరమని జేఎం ఫైనాన్షియల్​కు చెందిన  అగర్వాల్ చెప్పారు. మొత్తం 58 ఇష్యూల్లో 38 సెప్టెంబర్,  డిసెంబర్‌‌‌‌లలో వచ్చాయి. 2023లో సగటు టిక్కెట్ పరిమాణం రూ. 865 కోట్లు ఉంది. గతేడాది కూడా ఇదే పరిస్థితి. ఎల్‌‌‌‌ఐసి, డెల్హివెరీ మినహా, మెజారిటీ ఐపీఓలు రూ. 1,500 కోట్ల ఐపీఓ విభాగంలో ఉన్నాయి. మ్యాన్‌‌‌‌కైండ్ ఫార్మా ఐపీఓ (రూ. 4,326 కోట్లు) 2023లో అతిపెద్ద ఇష్యూగా ఉంది. తర్వాతి స్థానాల్లో టాటా టెక్నాలజీస్ (రూ. 3,042 కోట్లు), జేఎస్​డబ్ల్యూ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ (రూ. 2,800 కోట్లు), ఆర్‌‌‌‌కె లేబుల్ (రూ. 1,964 కోట్లు), సెల్లో వరల్డ్ (రూ. 1,900). ఈ కాలంలో అత్యంత చిన్న ఐపీఓ ప్లాజా వైర్స్ కాగా, ఇది రూ. 67 కోట్లు సమీకరించింది. 

ఐపీఓలు ఎందుకంటే..

పబ్లిక్​ ఇష్యూకు రావడం వల్ల వచ్చే డబ్బుతో కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు. వర్కింగ్ క్యాపిటల్, అప్పుల చెల్లింపుల కోసం అదనపు నిధులు లభిస్తాయి. ఇది సంస్థ  విజిబిలిటీని కూడా పెంచుతుంది. మరిన్ని వ్యాపార అవకాశాలను ఆకర్షిస్తుంది. మోటిసన్స్ జ్యువెలర్స్, ప్లాజా వైర్స్​, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్,  ఐడియాఫోర్జ్ టెక్నాలజీతో సహా కొన్ని ఇష్యూలు 100 కంటే ఎక్కువ రెట్లు సబ్​స్క్రయిబ్​ అయ్యాయి.

 లిస్టింగ్ లాభాలు కూడా భారీగా వచ్చాయి. ఈ ఏడాది లిస్టయిన కంపెనీల్లో 47 కంపెనీలు తమ ఇష్యూ ధర కంటే ఎక్కువగా ట్రేడవుతుండగా, కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడవుతున్నాయి. కొన్ని సంస్థలు 0.25 శాతం నుంచి 228 శాతం వరకు  లాభాలను అందించాయి. పారిశ్రామిక, వినియోగదారుల విచక్షణ,  ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల కంపెనీలు ఎక్కువగా ఐపీఓలకు వచ్చాయి. టెక్నాలజీ  ఫైనాన్స్ గణనీయమైన సహకారాన్ని అందించాయి. గత సంవత్సరం 109 ఎస్​ఎంఈ ఇష్యూలు రాగా, ఈ ఏడాది 175 వచ్చాయి.