
- బాసర, సోన్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి
నిర్మల్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలోని సోన్, బాసర మండలాల్లో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అదైర్యపడొద్దని హామీ ఇచ్చారు.
పంట నష్టంపై ఆఫీసర్లు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు రూపొందించారని, పూర్తిస్థాయి నివేదిక అందగానే పరిహారం విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించి వ్యవసాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు.
మంత్రి వెంట కలెక్టర్ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్, ఎంపీ గొడం నగేశ్, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, రాష్ట్ర మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి ఉన్నారు.