డిగ్రీ ఎగ్జామ్​ సెంటర్​ ఏర్పాటు చేయాలని ఆందోళన

డిగ్రీ ఎగ్జామ్​ సెంటర్​ ఏర్పాటు చేయాలని ఆందోళన

మరికల్, వెలుగు :  మక్తల్​లో డిగ్రీ ఎగ్జామ్​ సెంటర్​ ఏర్పాటు చేయాలని కోరుతూ మరికల్​లోని సరస్వతి డిగ్రీ కాలేజీ ముందు బుధవారం డిగ్రీ స్టూడెంట్స్​ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల నుంచి రావడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టైం అవుతుందనే భయంతో ఉరుకులు, పరుగుల మీద వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోయారు.

మూడేండ్ల నుంచి మక్తల్​లో ఎగ్జామ్​ సెంటర్​ ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదున్నారు. ఎగ్జామ్​ ప్రారంభమైనా విద్యార్థులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు. చివరకు మక్తల్​ నుంచి అయ్యప్ప కాలేజీ నిర్వాహకులు వచ్చి పరీక్ష రాయాలని సూచించారు. పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాలమూరు యూనివర్సిటీ ఏఎస్డీ మధుసూదన్​రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు రాజ్​కుమార్, కుమారస్వామి పరీక్ష కేంద్రానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదిలాఉంటే మరికల్​లోని సరస్వతి డిగ్రీ కాలేజీలో సెకండ్​ ఇయర్​ ఎగ్జామ్​ రాస్తూ డీబారైన మాగనూర్​ మండలం అచ్చంపేటకు చెందిన ఆంజనేయులు సూసైడ్​ చేసుకున్నాడు. స్టూడెంట్  ఫ్యామిలీకి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్​యూ నాయకులు యూనివర్సిటీ అధికారులను కోరారు.