తహసీల్దార్ల పవర్స్​పై గందరగోళం

తహసీల్దార్ల పవర్స్​పై గందరగోళం

అర్బన్​ ఏరియాల్లో తలనొప్పులు 

సాగు భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యత అప్పగించిన ప్రభుత్వం

అర్బన్​ ఏరియాలో సాగు భూములు తక్కువే

హైదరాబాద్‌, వెలుగు: అర్బన్​ ఏరియాలోని తహసీల్దార్ల పవర్స్​పై గందరగోళం ఏర్పడింది. ఇన్నాళ్లూ భూరికార్డుల నిర్వహణ, పాస్​బుక్స్​ జారీలో కీలక పాత్ర పోషించిన తహసీల్దార్లను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించి సాగు భూముల రిజిస్ట్రేషన్లు అప్పజెప్పింది. హైదరాబాద్ జిల్లాలో 16కు 16 మండలాలు అర్బన్​ పరిధిలోనే ఉన్నాయి.  అలాగే మేడ్చల్​ జిల్లాలోని 15 మండలాలు ఉండగా కీసర, మూడు చింతలపల్లి, శామీర్​పేట మండలాల్లో మాత్రమే ఓ మేర వ్యవసాయ భూములు ఉన్నాయి. మిగతా 12 మండలాల్లో నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్సే​ ఎక్కువ. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇలా  70 నుంచి 80 శాతం నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్స్​ కలిగిన మండలాల్లో తహసీల్దార్లకు అగ్రికల్చర్​ ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ పనులు తక్కువే ఉండే అవకాశముంది. దీంతో ఈ మండలాల తహసీల్దార్లకు సాగు భూముల రిజిస్ట్రేషన్​ బాధ్యతలు పెద్దగా ఉండవు. మరి వారికి ఏ పవర్స్​ అప్పగిస్తారన్న దానిపై అయోమయం నెలకొంది. అందరు తహసీల్దార్లకు కామన్​గా ఉన్న  వెల్ఫేర్​ స్కీంల అమలు పర్యవేక్షణ, సివిల్ సప్లయీస్​, ప్రొటోకాల్, ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ తదితర బాధ్యతలకే వీరిని పరిమితం చేస్తారా.. అన్న దానిపై చర్చ నడుస్తోంది.

జనరల్ అడ్మినిస్ట్రేషన్​కే ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు

రాష్ట్రంలోని ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్ల అధికారాల్లో ప్రభుత్వం కోత విధించింది. ఇదివరకు తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని భూవివాదాలు, తహసీల్దార్​ కోర్టు ఇచ్చిన తీర్పులపై ప్రజలు ఆర్డీవో కోర్టుకు అప్పీల్ కు వెళ్లేవారు. ఆర్డీవో కోర్టులో పరిష్కారం కాకపోతే అడిషనల్​ కలెక్టర్​ కోర్టుకు వెళ్లేవారు. ఇప్పుడు రెవెన్యూ కేసుల విచారణ నుంచి ఆర్డీవోలను, అడిషనల్​ కలెక్టర్లను తప్పించారు. దీంతో వీరిని ప్రభుత్వం జనరల్​ అడ్మినిస్ట్రేషన్​కే  పరిమితం చేయన్నట్లు తెలిసింది.

వీఆర్వోలను ఏ శాఖల్లో చేర్చుకుంటారో..?

వీఆర్వోలను వేరే శాఖల్లో విలీనం చేస్తామని, ఆప్షన్లు     పెట్టుకోవచ్చని సీఎం ప్రకటించడంతో ఆ శాఖలు ఏమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ ఊళ్లలో పని చేసిన తమను ఎక్కడ, ఏ శాఖలో సర్దుబాటు చేస్తారోననే బెంగ పట్టుకుంది. అవినీతి ముద్ర వేసి సాగనంపుతున్న తమను ఆయా శాఖల ఉద్యోగులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడ్యుకేషన్​ క్వాలిఫికేషన్స్​, వారికున్న కంప్యూటర్ స్కిల్స్​  ఆధారంగా కొందరు వీఆర్వోలను రెవెన్యూ శాఖలో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఒక్కో ఊరుకు ఎందరు వీఆర్​ఏలు అవసరమో గుర్తించి ఊళ్ల వారీగా రిపోర్టులు పంపాలని, వాటి ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే తహసీల్దార్లను ఆదేశించింది.

For More News..

రేపటితో అసెంబ్లీ సమావేశాలు ఆపేసే యోచనలో ప్రభుత్వం!

‘కాళేశ్వరం’ అక్కర్లేకుండానే నిండిన ఎస్సారెస్పీ

సిటీలో మళ్లీ మొదలైన నైట్ లైఫ్