ఓట్ చోరీ.ఇన్ పోర్టల్ ప్రారంభించిన కాంగ్రెస్.. మద్దతు తెలపాలని రాహుల్ రిక్వెస్ట్

ఓట్ చోరీ.ఇన్ పోర్టల్ ప్రారంభించిన కాంగ్రెస్.. మద్దతు తెలపాలని రాహుల్ రిక్వెస్ట్

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం (ఈసీ)తో కలిసి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈమేరకు ఒక వెబ్ పోర్టల్‎ను లాంచ్ చేసింది. యూజర్లు ఈ పోర్టల్‎లో రిజిస్టర్ చేసుకొని ఎన్నికల సంఘం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్  చేయవచ్చని కాంగ్రెస్ నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ ఓటరు జాబితా కోసం గళమెత్తుతున్న రాహుల్‎కు మద్దతు తెలపవచ్చని చెప్పారు. 

‘ఓట్ చోరీ.ఇన్/ఈసీడిమాండ్’లో రిజిస్టర్ చేసుకొని తనకు మద్దతు తెలపాలని కోరుతూ రాహుల్​గాంధీ ‘ఎక్స్’లో ఓ వీడియో విడుదల చేశారు. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అనే ప్రజాస్వామ్య సూత్రంపై ఓట్ల చోరీ ఒక దాడి ఆని ఆరోపించారు. పారదర్శక, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే డిజిటల్ ఓటరు జాబితా విడుదల చేయాలని డిమాండ్  చేశారు.

లాగిన్​తో సర్టిఫికెట్​

‘ఓట్ చోరీ’లో యూజర్ లాగిన్ అయ్యాక ఆ వ్యక్తి పేరిట ఒక సర్టిఫికెట్ జారీ అవుతుంది. ‘‘డిజిటల్  ఓటర్ల జాబితా కోసం రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్‎కు నేను సపోర్ట్  చేస్తున్నా” అని ఆ సర్టిఫికెట్‎లో మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కోశాధికారి అజయ్ మాకెన్​ల సంతకం ఆ సర్టిఫికెట్‎లో ఉంటుంది.