సీఎం కేసీర్ పిట్ట‌ల దొర‌లా క‌హానీలు చెప్పారు

సీఎం కేసీర్ పిట్ట‌ల దొర‌లా క‌హానీలు చెప్పారు

కామారెడ్డి జిల్లా : సీఎం కేసీర్ పిట్ట‌ల దొర‌లా క‌హానీలు చెప్పార‌న్నారు కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ. బుధ‌వారం ఆయ‌న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంగ‌ళ‌వారం దాదాపు ఏడున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశం త‌ర్వాత‌ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారన్నారు. ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని ఇస్తారని ఆశించాం, కానీ.. సీఎం పిట్టల దొరలా కహానీలు చెప్పారని తెలిపారు. ప్రతిపక్షం అయినా కరోనా సమయంలో ప్రధాని, సీఎం మాటలకు విలువ ఇచ్చి లాక్ డౌన్ నిబంధనలు పాటించామ‌న్నారు. ప్రభుత్వాన్ని బధనాం చేసేలా మెమెప్పుడు మాట్లాడలేదని..కానీ సీఎం కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు చేశార‌న్నారు.

కేంద్రం 17 దాకా లాక్ డౌన్ పొడగిస్తే.. సీఎం 29 దాకా పెంచారని తెలిపారు. దేశంలో నేనే గొప్ప అని కేసీఆర్ అనుకుంటున్నార‌ని.. రైతులను ఆదుకోవాలని అంటే మమ్మల్ని పిచోళ్ళు అంటున్నార‌ని తెలిపారు. కేసీఆర్ కు రాజకీయ జన్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్న ష‌బ్బీర్ అలీ.. కరోనా పేషేంట్ల గురించి నిజాలు దాస్తున్నారన్నారు. టెస్టింగ్ కిట్లు లేకుండా పాజిటివ్ ఎలా నిర్దారిస్తున్నారని..గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి లాడ్జి మాదిరిగా ఉందని డాక్ట‌ర్లు చెప్పార‌న్నారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ధాన్యం కొంటున్నానని సీఎం చెబుతున్నారన్నారు.

ఛత్తీస్ ఘడ్ మంత్రితో మాట్లాడామ‌ని..రూ. 11 వేల కోట్లు రుణమాఫీ చేయడంతో పాటు.. క్వింటాలుకు 2500 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఛాలెంజ్ చేస్తున్నాన‌ని.. మీ బృందం అంతా రండి. ఛత్తీస్ ఘడ్ లో సమావేశం నిర్వహిద్దామ‌న్నారు. కేసీఆర్ నోరు జారకుండా మాట్లాడాల‌ని ..ఆకాశంపై ఉమ్మితే అది మనమిదే పడుతుందని తెలుసుకోవాల‌న్నారు. కేసీఆర్ చరిత్ర అంద‌రికీ తెలిసిందేన‌ని.. యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పాస్ పోర్టు దందా చేసింది నిజం కాదా అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు.

కరోనా సమయంలో మీ నాయకులు ఎక్కడున్నారని ప్ర‌శ్నించిన ష‌బ్లీర్ అలీ.. మా నాయకులు వలస కార్మికులకు అండగా ఉన్నారని తెలిపారు. 133 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మీ కింద పని చేయాలా అన్నారు. 64 వేల కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోడీ కేటాయించార‌ని..నమస్తే ట్రంప్ కార్యక్రమానికి 160 కోట్లు ఖర్చు చేశారు క‌నీ..వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్ళడానికి మాత్రం రైలు టికెట్ల కోసం డబ్బులు ఉండవా అని ప్ర‌శ్నించారు. ఇదేనా కేంద్రం అవలంబించే విధానం అన్నారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. రైతుల పక్షాన, వలస కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, కార్మికులకు అన్ని సౌకర్యాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని తెలిపారు ష‌బ్బీర్ అలీ.