టికెట్ల ఆశతో..గ్రూపులుగా కాంగ్రెస్ ​లీడర్లు

టికెట్ల ఆశతో..గ్రూపులుగా కాంగ్రెస్ ​లీడర్లు

నిజామాబాద్, వెలుగు పైరవీలు, పలుకుబడి ఇతర అంశాలతో పనిలేకుండా వచ్చే 6 నెలలు కష్టపడి పనిచేసిన వారికి అవకాశం లభిస్తుందని ఇటీవల కాంగ్రెస్ ​రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రకటించారు. 15 రోజులకోసారి లీడర్ల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటామని కామెంట్​ చేయడంతో జిల్లా లీడర్లు అలర్ట్‌ అయ్యారు. విడివిడిగా క్యాడర్​ మెయింటెయిన్​​ చేస్తూ, ఎవరికి వారే ప్రోగ్రామ్స్​ ఆర్గనైజ్​ చేసుకుంటున్నారు. కార్యకర్తలను డివైడ్​చేసి తమ వారిగా ఐడెంటిటీ  ఇస్తున్నారు.

ఇందూరులో ఇలా..

జిల్లా కేంద్రంలోని అర్బన్​ అసెంబ్లీ స్థానానికి పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​కుమార్​గౌడ్​ తనకు టికెట్​రావడం ఖాయమనే ధీమాలో ఉన్నారు. తన క్యాడర్​తో కలిసి గడపగడపకు కాంగ్రెస్​పేరుతో నగరంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి నగర కాంగ్రెస్​ప్రెసిడెంట్​కేశవేణు సైతం యాక్టివ్​అయ్యారు. ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మైనార్టీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ ​ఆసక్తి చూపుతున్నారు. 2018లో కాంటెస్ట్​చేసి ఓడిపోయిన తనకు ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్​ పెద్ద కొడుకు, మాజీ మేయర్ ​సంజయ్​ అర్బన్​స్థానం పోటీ ఆశతో ఇటీవల కాంగ్రెస్​లో చేరారు. ఏ లీడర్​ను జత చేసుకోకుండా సెల్ఫ్​గా ప్రోగ్రామ్స్​చేసుకుంటున్నారు.  

బోధన్​లో..

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎలక్షన్​లో బోధన్​ నుంచి వరుసగా రెండు సార్లు ఓడిన మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి ఈ ఎన్నికల్లోనూ మళ్లీ పోటీచేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. గడపగడపకు కాంగ్రెస్​ కార్యక్రమంతో కార్యకర్తలకు టాచ్​లో ఉంటున్నారు. మరో నేత కెప్టెన్​కరుణాకర్​రెడ్డి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. చట్టసభలకు వెళ్లాలనే లక్ష్యంతో యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కరుణాకర్​రెడ్డి​ఇప్పటికే పలుపార్టీలు మారి తిరిగి సొంత గూటిలో ఉన్నారు. నియోజకవర్గంలో కెప్టెన్​కరుణాకర్​ యువసేన పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిన్నారు. ఈసారి ఎలాగైనా టికెట్​ సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

రూరల్​లో ఆశావహులు అధికం..

రూరల్​ స్థానంపై డాక్టర్​భూపతిరెడ్డి గురిపెట్టారు. మార్కెట్​కమిటీ మాజీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి సైతం టికెట్​పై ఆశగా ఉన్నారు. దీనికితోడు సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న మరో వ్యక్తి పేరు తాజాగా ఇక్కడ ప్రచారంలో నడుస్తోంది. ఇక్కడ ఎవరికి వారే తమ క్యాడర్ ను​ కాపాడుకుంటూ ఉనికి కోసం 
ప్రయత్నిస్తున్నారు.  

ఆర్మూర్​లో పరిస్థితి భిన్నం..

ఆర్మూర్​లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ పోటీ చేసేందుకు ప్రస్తుతం స్థాయి ఉన్న లీడర్లు లేరు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన ఓ మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రభుత్య ఉద్యోగం చేస్తున్న ఆమె రిజైన్​చేయనున్నారనే ప్రచారం ఉంది. అర్బన్​లో కుదరని పక్షంలో తనకు ఆర్మూర్​లో అవకాశం లభించవచ్చని నగర మాజీ మేయర్​సంజయ్​ అంచనా  వేస్తున్నారు.