
- అందుకు కేబినెట్ విస్తరణే నిదర్శనం: పొన్నం
హైదరాబాద్, వెలుగు: కేవలం కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యమని, ఇది కేబినెట్ విస్తరణతో మరోసారి రుజువైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన చేస్తే ఏం లాభం అని ప్రశ్నించినోళ్లందరికీ, మంత్రివర్గ విస్తరణే సరైన జవాబు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘రాహుల్ గాంధీ ఆలోచనలకు మంత్రివర్గ విస్తరణ అద్దం పడుతున్నది. కులగణన చేస్తే బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లభిస్తుందో తెలంగాణలో రుజువవుతున్నది.
దేశంలో కులగణన చేస్తే ఎస్సీ, బీసీలకు ఎలాంటి రాజకీయ, ఇతర ప్రాధాన్యాలు చేకూరుతాయనే విషయంలో తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తున్నది” అని ప్రకటనలో పొన్నం పేర్కొన్నారు. కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, బీసీలకు తగిన న్యాయం చేసిన కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్కు కృతజ్ఞతలు చెప్పారు.