బోధన్ నియోజకవర్గంలో 3,500 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం : కాంగ్రెస్ పీసీసీ డెలిగేట్ గంగాశంకర్

బోధన్ నియోజకవర్గంలో  3,500 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం :  కాంగ్రెస్ పీసీసీ డెలిగేట్ గంగాశంకర్
  • ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదు
  • బీఆర్​ఎస్​కు అభ్యర్థులు లేకనే కాంగ్రెస్​పై కిడ్నాప్​ ఆరోపణలు 
  • పీసీసీ డెలిగేట్ గంగాశంకర్​ 

బోధన్​, వెలుగు : బోధన్​ నియోజకవర్గంలో 3,500 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు  ఇచ్చామని కాంగ్రెస్ పీసీసీ డెలిగేట్​ గంగాశంకర్​ అన్నారు. ఆదివారం బోధన్​ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన ఆరోపణలపై ప్రెస్​ మీట్ నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వహయాంలో ఇసుక అక్రమ దందా కొనసాగించారని విమర్శించారు. తాము ఇందిరమ్మ ఇండ్ల కోసం  డీడీలు చెల్లించి  ఇసుక సప్లయ్​ చేస్తున్నామన్నారు.

  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  ముంపునకు గురైన పంటలను సర్వే చేయించి,  పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కనీసం రైతులను పరామర్శించకుండా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.  ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్​, సిలిండర్​పై రూ.500 సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలు అమలు కావడం షకీల్​కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు.

 స్థానిక ఎన్నికల్లో  బీఆర్ఎస్​కు అభ్యర్థులు దొరకక కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ బోధన్​, సాలూర మండలాల అధ్యక్షులు నాగేశ్వరరావు, మందర్నా రవి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషామోయినొద్దీన్​, నాయకులు శరత్​ రెడ్డి, గణపతిరెడ్డి, తలారి నవీన్​, దామోదర్, ప్రమోద్ పాల్గొన్నారు.