- వాళ్లు లేకుంటే స్వేచ్ఛగా ఉందన్న రేవంత్
హైదరాబాద్ : కేసీఆర్, కేటీఆర్లు రాష్ట్రంలో లేకపోవడంతో ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారని, ఇది ఎక్కువ కాలం ఉండాలంటే ఆ ఇద్దరిని తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు పండించిన వడ్లను సర్కారు కొనకుండా మిల్లర్లతో కుమ్మక్కైందని, దీంతో గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. ఆ రైతు కుటుంబాలను పరామర్శించని సీఎం కేసీఆర్.. పంజాబ్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తుంకిమెట్ల, అంగడి రాయిచూర్, చంద్రకల్ గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన ఊరు అక్కంపేటకు వెళ్తే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ఏపాటిదో తెలుస్తుందని అన్నారు. ఊరిని సీఎం కేసీఆర్ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. అక్కడ కనీసం తాగేందుకు మిషన్ భగీరథ నీళ్లు లేవని, దళితులకు ఇళ్లు ఇవ్వలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని అన్నారు. కనీసం జయశంకర్ సార్ విగ్రహం కూడా పెట్టలేదని, స్మృతి వనం ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
ఓఆర్ఆర్ (ORR) అంటూ రైతుల నోటి కాడి కూడు లాక్కోవద్దు
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం పచ్చటి పంటలు పండే భూమిని సేకరించి చిన్న రైతుల నోటి కాడి కూడు లాక్కోవద్దని సీఎం కేసీఆర్ను పీసీసీ చీఫ్ రేవంత్ కోరారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఉన్న 21,517 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని గుర్తు చేశారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఎక్కువ మందికి రెండు మూడు ఎకరాల రైతులే ఉన్నారని, భూ సమీకరణ ద్వారా వాళ్లే నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.
భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తున్నట్టు కింది స్థాయి నేతలే చెప్తున్నారని, జీవోను రద్దు చేసినట్టు సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జయశంకర్ సార్ గ్రామం అక్కంపేట అధ్వానంగా ఉందని, అభివృద్ధి చేయలేదని లేఖలో పేర్కొన్నారు. కనీసం రెవెన్యూ గ్రామంగానూ గుర్తించట్లేదన్నారు. ఇప్పటికీ పెద్దపూర్ గ్రామ పరిధిలోనే కొనసాగించడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు. ఆ పెద్ద మనిషిపై సీఎం కేసీఆర్కు ఎంత విద్వేషం, వ్యతిరేకభావం ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందని రేవంత్ మండిపడ్డారు. అధికార మదంతో జయశంకర్ సార్కు గుర్తింపు రాకుండా చేశారని ఫైర్ అయ్యారు. భగీరథ నీళ్లు కూడా అక్కంపేటకు రావట్లేదన్నారు.
రచ్చబండ కార్యక్రమం సందర్భంగా నా దృష్టికి వచ్చిన రెండు కీలక విషయాలను @TelanganaCMO నోటిసుకు తీసుకొస్తున్నాను.
— Revanth Reddy (@revanth_anumula) May 22, 2022
1.తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి.
2.వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలు pic.twitter.com/gw1DG0o4dS
మరిన్ని వార్తలు : -
వర్సిటీల్లో వీసీలు వచ్చి ఏడాదైనా మారని పరిస్థితి
హెచ్సీఏకు అంబటి రాయుడు గుడ్ బై!