హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) 92వ జయంతి సందర్భంగా ఆయనను కాంగ్రెస్ వెటరన్ లీడర్ జానారెడ్డి గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కలల్ని నిజం చేయాలనేదే కాకా ఆకాంక్ష అని జానారెడ్డి అన్నారు. 19 ఏళ్ల వయస్సులోనే కాకా జాతీయ గుడిసెల సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కాకా కలిగించిన స్ఫూర్తితోనే పార్టీలకు అతీతంగా అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.
‘తెలంగాణ చూశాకే అయన కన్ను మూశారు. కాకా కోరుకున్న తెలంగాణ రాలేదని ఆత్మ ఘోషిస్తున్నట్లు వివేక్ చెబుతున్నారు. కాకా కోరుకున్న తెలంగాణ సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి. ఆయన ఆశయాలను వివేక్ కొనసాగిస్తున్నందుకు అభినందనలు. మార్గం వేరైనా ప్రజల కోసం పని చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. నేను 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆయన ప్రసంగం విన్నాను. ఇందిరా గాంధీ కలలు నిజం చేయాలని కాకా మాట్లాడేది. ప్రాణహిత చేవెళ్ల పథకానికి రూపకల్పన చేసింది కాకానే. ప్రాణహితకు అంబేడ్కర్ పేరు పెట్టాలని అడిగితే.. కాళేశ్వరం అని పేరు మార్చి అంబేడ్కర్ పేరు తీసేశారు’ అని జానారెడ్డి పేర్కొన్నారు.
సాయం చేయడం నేర్పారు
‘కాకా మాకు ఒక కల్చర్ నేర్పించారు. అందరితో కలిసి ఉండాలి. తప్పు జరిగితే నిలదీయాలి. నాన్న పేరుతో ఫౌండేషన్ పెట్టాం. కొవిడ్ టైమ్లో చాలా మందికి సాయం చేశాం. ఎంత ఎత్తుకు ఎదిగినా పేదలకు సహాయం చేయాలని మా నాన్న చెబుతుండేవారు’ అని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.